By ETV Bharat Andhra Pradesh Team
Published : 6 hours ago
మద్యం షాపులపై నిరంతర నిఘా - అధిక రేటుకు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎక్సైజ్ కమిషనర్ - Excise Commissioner On LiquorPolicy
Excise Commissioner Nishant Kumar On New Liquor Policy: కొత్త మద్యం పాలసీ ప్రక్రియ ప్రారంభమైందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఎంఆర్పీ ధర కంటే అధిక రేటుకు మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన మద్యం పాలసీ ఈ నెల 12వ తేదీ నుంచి అమలు కానుందని తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు టెండర్లకు దరఖాస్తులు స్వీకరించి 11వ తేదీన లాటరీ విధానం ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. 2 శాతం వచ్చే లాండెడ్ సెస్తో డీ అడిక్షన్ కేంద్రాలకు ఖర్చు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ స్పష్టం చేశారు. పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులకు అనుమతి లేదని తెలిపారు.
మద్యం షాపులపై నిరంతర నిఘా ఉంటుంది నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. పాఠశాలలు, ఆలయాలకు వంద మీటర్ల పరిధిలో అనుమతి మద్యం షాపులకు అనుమతి లేదని వివరించారు. ప్రతి దుకాణంలో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం దుకాణాల్లో నాణ్యమైన బ్రాండ్స్ దొరుకుతాయని ఈ నెల 12 నుంచి కొత్త విధానం అమలుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి న్యాయం చేయాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకు పాత విధానమే అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త మద్యం విధానం వల్ల సిండికేట్ కావడానికి అవకాశం లేదని అన్నారు. 2017లో ఒక్కో షాపునకు 18 దరఖాస్తులు వచ్చాయని ఇప్పుడు ఎక్కువే రావొచ్చని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు.