కటకపల్లిలో వేడుకగా దేవీనవరాత్రులు - కనుల పండువలా సాంస్కృతిక కార్యక్రమాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
|Updated : 3 hours ago
Devi Navaratrulu At Vizianagaram District Katakapalle : దేవీ శరన్నవరాత్రోత్సవాలు, దసరా మహోత్సవాలు అంతటా భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయాలకు క్యూ కడుతున్న భక్తులువివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనుగ్రహం పొందుతున్నారు. భక్తుల తాకిడితో దుర్గామాత మందిరాలు కిటకిటలాడాయి. పలుచోట్ల అమ్మవారికి చేసిన ప్రత్యేక అలంకరణలు ఆకట్టుకున్నాయి. కాగా, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కటకపల్లి గ్రామస్థులు దేవీ నవరాత్రులు వినూత్నంగా నిర్వహించారు. భక్తులంతా భవానీ మాల ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బాల భవానీలు సందడి చేశారు.
చిన్నారుల కోలాటం, నృత్య ప్రదర్శనలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. గ్రామస్థులంతా సమైక్యంగా ఏటా శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని భక్తులు, మహిళలు తెలిపారు. నవరాత్రులు ఒక్కోరోజు ఒక్కో అలంకరణతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. దుర్గామాతను గాజులతో తీర్చిదిద్ది వాటిని ఊరిలో ఉన్న మహిళలు పంచుకుంటారని, ఇలా చెయ్యడం వల్ల వారికి మంచి జరుగుతుందని భవానీ భక్తురాలు సీహెచ్. పద్మా లావణ్య తెలిపారు. నవరాత్రి వేడుకలు విజయవంతం చేయడానికి పి.శ్రీను, కే.జాన్సీ, సీహెచ్ కిశోర్, సీ.హెచ్.రామునాయుడు, సత్యవతి, కే.నాయుడు, బీ.గణేష్, కే.సాయి, సీహెచ్ కృష్ణ, సీహెచ్ దేవీ సహా గ్రామ ప్రజలు సహరించారని నిర్వాహకులు తెలిపారు.