By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 9:32 PM IST
నిజాంపట్నం హార్బర్ను పరిశీలించిన కలెక్టర్ - సమస్యల పరిష్కారానికి హామీ - Collector Nizampatnam Harbour Visit
Collector Inspected Nizampatnam Harbour: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ను జిల్లా కలెక్టర్ వెంకట మురళీ పరిశీలించారు. నీటి మార్గం నుంచి బోటులో నిజాంపట్నం జెట్టి వద్దకు చేరుకున్న కలెక్టర్, హార్బర్ అభివృద్ది పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపానుల సమయంలో మత్స్యకారులు సురక్షితంగా ఉండేందుకు సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. బీచ్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హార్బర్లో బోట్లు నిలుపుదల చేసే జెట్టి, మత్స్య సంపద గ్రేడింగ్ చేసే ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
సముద్రంలోని వనరులు అందుబాటులోకి తెచ్చి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హార్బర్ను పర్యాటక రంగంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. స్థానిక మత్స్య కారుల సమస్యలను టీడీపీ నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నత్త నడకగా నడుస్తున్న జెట్టీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఎండుచేపలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు చేపలు ఎండ బెట్టుకునేందుకు ఫ్లాట్ ఫాంలు ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.