జగన్మోహన్ రెడ్డి అహంకారం పరాకాష్టకు చేరింది - ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలి : బుద్ధా వెంకన్న - సిద్దం బహిరంగ సభ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 12:17 PM IST
Buddha Venkanna Comments on Siddham Meeting in Twitter: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సంగివలస వద్ద శనివారం నిర్వహించిన 'సిద్ధం' బహిరంగ సభలో వైసీపీ జెండా రంగులతో ఏర్పాటు చేసిన వేదికను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ట్విటర్ (X) వేదికగా విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అహంకారం పరాకాష్టకు చేరింది. దేవుడే నా కాళ్ల కింద ఉన్నారు, మీరెంత అని ప్రజలను ఉద్దేశించినట్లుంది సిద్ధం సభ అని ఆయన పోస్టు చేశారు.
శనివారం విశాఖ జిల్లా భీమిలిలో ‘సిద్ధం’ పేరిట బహిరంగ సభ నిర్వహించారు. 'ఎన్నికల ప్రచార సభకు జగన్ సిద్ధమై వచ్చినట్లే కనిపించలేదు. ప్రసంగం ప్రారంభం నుంచి చివరి దాకా ఐప్యాక్ రాసిన స్క్రిప్టును చూసి చదవడమే సరిపోయింది. జగన్ తన ప్రసంగంతో కార్యకర్తల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు పడరాని పాట్లు పడ్డట్లు తెలుస్తోంది. నవరత్నాల్లోని సంక్షేమ పథకాలైన పింఛన్లు, విద్యార్థులకు ట్యాబ్లు, చేయూత అంటూ మూడుసార్లు ప్రస్తావించారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, 56 నెలల్లో ఎక్కడ చూసినా జగన్ మార్కు పాలన కనిపిస్తుందని ఢంకా కొట్టిన జగన్ ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు సీఎం ఉత్తరాంధ్రకు ఏం అభివృద్ధి చేశారో చెప్పనేలేదు.' అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.