శివ శివా! శ్రీశైలం పులిహోర ప్రసాదంలో ఎముక : ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు - శ్రీశైలం పులిహోరలో ఎముక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 10:09 AM IST
Bone In Srisailam Prasadam: కమ్మగా, మెత్తగా ఉండాల్సిన శ్రీశైలం పులిహోరలో కోడి ఎముక కలకలం రేపింది. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం భక్తులకు అందించిన ప్రసాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లన్న దర్శనానంతరం భక్తులకు నిత్యప్రసాద వితరణలో పులిహోరను అందించారు. భక్తులు తినడానికి ప్రయత్నించగా గట్టిగా తగిలిందని పరిశీలిస్తే ఎముక బయటపడిందని బాధిత భక్తుడు తెలిపాడు. ఈ విషయాన్ని ఆలయ ఏఈఓకు ఫిర్యాదు చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో జరిగిన దుర్ఘటనపై నంద్యాల జిల్లాా బీజేపీ అధ్యక్షురాలు శబరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలోకి ఎముక ఎలా వచ్చిందని దేవస్థానం నిర్వాహకులను భక్తులు నిలదీశారు.
Devotees Get Angry on Temple Administrators: హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రసాదం తింటున్నప్పుడు నోటికి గట్టిగా తగిలిందని, కొరికితే అది రెండు ముక్కలైందని ఏమిటని చేతిలో వేసి చూడగా అది మాంసం ఎముకగా గుర్తించామని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు.