By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 5:17 PM IST
'వాలంటీర్ల రాజీనామా'- కౌంటర్ దాఖలుపై హైకోర్టు ఆదేశాలు - HC on Volunteers Resign Petition
AP High Court on Volunteers Resign Petition: వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికల వరకు ఆమోదించవద్దని కోరుతూ బీసీవైఎమ్ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గతంలో వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. సుమారు 64వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వాలంటీర్ల రాజీనామాపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలో 62,571 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారని హైకోర్టుకు ఇటీవల ఈసీ నివేదించింది. అయితే వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాకు కారణాలు తెలియవని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వారిలో 929 మంది వాలంటీర్లను ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కారణంగా తొలగించినట్లు తెలిపారు.