ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో వైఎస్సార్సీపీ అక్రమాలు - టిడ్కో ఇళ్ల పేరుతో భారీగా దోపిడీ - Irregularities in Amrit Scheme

YSRCP Leaders Irregularities in Amrit Scheme: గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు. దీనికెంత బిల్లు చేసుకున్నారో తెలుసా? అక్షరాలా రూ. 28 లక్షల రూపాయలు! పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నాటి వైఎస్సార్సీపీ నేతలు అమ్మేసుకున్నారు. ఎంతకో తెలుసా? ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు అంతేకాదు ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు కొట్టేసేందుకూ ఎత్తుగడ వేశారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 10:45 AM IST

YSRCP Leaders Irregularities in Amrit Scheme at Gudivada
YSRCP Leaders Irregularities in Amrit Scheme at Gudivada (ETV Bharat)

YSRCP Leaders Irregularities in Amrit Scheme :నాటి ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఆనాటి ప్రజాప్రతినిధి, ఇతర నాయకులు గుడివాడను పీల్చిపిప్పి చేసేశారు. మైకుల ముందు బూతులు మాట్లడటమే కాకుండా వెనక దొంగ పనులు కూడా చేసేశారు. ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదు, వారి బాధలనూ చూడలేదు. జనం సొమ్మును మాత్రం నిస్సిగ్గుగా దోచేశారు.

గుడివాడలో వైఎస్సార్సీపీ నాయకులు టిడ్కో ఇళ్లను అక్రమంగా అమ్మేసుకోవడం, ఇంటింటికీ కుళాయిల మరమ్మతులు పేరుతో దొంగ బిల్లులు పెట్టడం ఇలా దొరికినకాడికి దోచేశారు. బినామీ పేర్లతో అందినంత నొక్కేశారు. నాటి ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన అనుచరులు చెలరేగిపోయారు. తాజాగా ప్రభుత్వం మారడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాటి మున్సిపల్‌ కమిషనర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ బిల్లులు పెట్టుకుని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన విషయం తాజాగా కలకలం రేపుతోంది.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో టిడ్కో లబ్ధిదారుల అవస్థలు - చంద్రబాబు రాకతో చిగురించిన ఆశ - Plight of TIDCO Beneficiaries

పైపులైన్ల పేరుతో కొత్తగా బిల్లులు పెట్టి భారీగా సొమ్ము :గుడివాడ పురపాలకసంఘంలోని 36 వార్డుల్లో ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు కేంద్రప్రభుత్వ అమృత్‌ పథకం కింద రూ. 30 కోట్లతో పైపులైన్లు వేశారు. ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేశామంటూ గుత్తేదారులు మొత్తం బిల్లులు చేసుకున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో వీధుల్లో పైపులైన్లు ఉన్నా దాదాపు 2 వేల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వనేలేదు. చాలాచోట్ల ప్రజలు నిలదీయడంతో మరో కొత్త గుత్తేదారును తెచ్చి ఆ పనులు ప్రారంభించారు.

ఇందుకోసం కొత్తగా బిల్లులు పెట్టి భారీగా సొమ్ము గుంజేశారు. అంటే అమృత్‌ పథకంలో వేశామంటూ బిల్లులు పెట్టుకున్నవాటికే రెండోసారి మున్సిపాల్టీ నుంచి వసూలు చేసుకున్నారన్నమాట. వాస్తవానికి అమృత్‌ పథకం కింద ఎక్కడెక్కడ పనులు చేశారు? ఇళ్లకు ఎక్కడెక్కడ కనెక్షన్లు ఇచ్చారో పక్కాగా లెక్కలు చూపించాలి. ఇవేమీ చేయకుండానే సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు :గుడివాడలో అమృత్‌ పథకం పైపులైన్ల లీకేజీలకు మరమ్మతుల పేరుతో రూ. లక్షల్లో కొల్లగొట్టేశారు ఓ వైఎస్సార్సీపీ నేత, అతనికి అనుకూలంగా ఉండే బినామీ గుత్తేదారు. చాలా ఇళ్లకు గతంలో ఉన్న కనెక్షన్లకే అమృత్‌ పైపులైను అనుసంధానించడంతో తరచూ నీరు లీకయ్యేది. దీన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఓ మహిళా ఏఈ సహకారంతో రూ. కోట్లలో దండుకున్నారు.

టిడ్కో ఇళ్ల రుణ మాఫీపై మడమ తిప్పిన జగన్ - Jagan Fraud Tidco Beneficiaries

పైగా గతంలో మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేసిన వి. మురళీకృష్ణ సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 70 లక్షలకుపైగా బిల్లులు రావాలంటూ ఎన్నికలకు ముందు దస్త్రం పెట్టారు. ఇది బయటకు పొక్కడంతో వివాదంగా మారింది. ప్రస్తుతం సత్తెనపల్లి ఆర్డీవోగా పని చేస్తున్న నాటి కమిషనర్‌ వి. మురళీకృష్ణ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ పురపాలక అధికారులను డిమాండ్‌ చేశారు.

లోతుగా విచారణ :గుడివాడలో అమృత్‌ పథకం కింద చేసిన పనులు, ఆ తర్వాత మళ్లీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం, లీకుల పేరుతో పెట్టిన బిల్లులు వీటన్నింటిపై లోతుగా విచారణ చేయిస్తే భారీ కుంభకోణం బయటపడడం ఖాయం.

రూ. 50 కోట్ల వరకూ దోచుకున్నట్టు ఆరోపణలు :గుడివాడ పురపాలకసంఘంలో గతంలో సహాయ కమిషనర్‌గా చేసిన ఓ అధికారి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన నాయకుడు కలిసి ఏకంగా 1600కుపైగా టిడ్కో ఇళ్లను అమ్మేసుకున్నారు. నిబంధనలతో సంబంధం లేకుండా, మున్సిపాలిటీ పరిధిలోనివారు కాకుండా ఎక్కడెక్కడివాళ్లకో ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు అమ్మేశారు. ఇలా దాదాపు రూ. 50 కోట్ల వరకూ దోచుకున్నట్టు ఆరోపణలున్నాయి.

గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించగా వీటిలో ఏడువేల ఇళ్లను వైఎస్సార్సీపీ హయాంలో కేటాయించారు. ఇందులో 1600కుపైగా ఇళ్లను అమ్ముకున్నారు. వాస్తవంగా మున్సిపాల్టీలో నివసిస్తూ ఆధార్, రేషన్‌కార్డు ఉన్నవారికే కేటాయించాలని నిబంధనలున్నాయి. కానీ ఎక్కడెక్కడివారినో తీసుకొచ్చి ఆధార్‌కార్డు చిరునామా గుడివాడకు మార్చేసి మరీ డబ్బులు తీసుకుని ఇళ్లను కేటాయించారు. దీనిపై అప్పట్లోనే టీడీపీ నాయకులు బయటపెట్టినా పట్టించుకోలేదు.

నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు :పురపాలకసంఘంలో శానిటేషన్‌ నిధులు సైతం భారీగా పక్కదారి పట్టాయి. వీటిపై లోకాయుక్తకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. నాటి సీఎం జగన్‌ టిడ్కో కాలనీ ప్రారంభోత్సవానికి గుడివాడ వచ్చినప్పుడు నిర్వహించిన బహిరంగ సభలో నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేసినందుకు ఏకంగా రూ. 28 లక్షల బిల్లు వసూలు చేసుకున్నారు. ఇది తెలిసి అధికారులు నివ్వెరపోయారు.

"నేను గుడివాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు దొంగ బిల్లులతో ఓ దస్త్రం తెచ్చారు. రూ. 70 లక్షల పనులు చేశారని, బిల్లులు మంజూరు చేస్తూ సంతకం చేయాలని కిందిస్థాయి అధికారులు కోరారు. అనుమానం వచ్చి వాటిని వెనక్కి తిప్పి పంపా. సంతకాలు చేయాలంటూ నాపై రాజకీయంగానూ ఒత్తిడి తెచ్చారు. బదిలీపై సత్తెనపల్లి వచ్చేశాక ఆ దస్త్రంపై నా సంతకాలను ఫోర్జరీ చేసి బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని తీవ్ర విషయంగా పరిగణించాలి. దొంగ బిల్లులను ఫోరెన్సిక్‌ అధికారులతో పరిశీలన చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి."- వి.మురళీకృష్ణ, సత్తెనపల్లి ఆర్డీవో

పేదల ఇళ్లపై పగబట్టిన జగన్‌ సర్కార్ - అయిదేళ్లుగా పూర్తి చేయని వైనం

ABOUT THE AUTHOR

...view details