YS Sharmila Chalo Secretariat Protest:దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు 'చలో సెక్రటేరియట్'కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. షర్మిలను ఆంధ్రరత్న భవన్లో నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు చలో సెక్రటేరియట్ కార్యక్రమం నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లోనే బస చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రమే విజయవాడకు షర్మిల చేరుకున్నారు. అయితే షర్మిల బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో బస చేయాల్సి ఉండగా, ముందస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసి ఉదయం చలో సెక్రటేరియట్ వెళ్లాలని నిర్ణయించారు. పలుచోట్ల కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టులు, గృహనిర్బంధం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మస్తాన్వలి, రుద్రరాజును పోలీసులు అరెస్టు చేశారు.
చలో సచివాలయం నిర్వహించి తీరుతాం: రాత్రి నుంచి పోలీసు దమనకాండ కొనసాగుతోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. అక్రమంగా కేసులు పెడుతున్నారనని, పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల నిరసన చేస్తారన్న గిడుగు రుద్రరాజు, చలో సచివాలయం నిర్వహించి తీరుతామని చెప్పారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బందోబస్తు : మరోవైపు చలో సచివాలయం పిలుపు దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకపోకలు సాగించకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. మందడం, మల్కాపురంలో సచివాలయానికి వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
చలో సెక్రటేరియట్ను పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతల గృహనిర్బంధాలపై షర్మిల సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలివస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని నిలదీశారు.