ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డబ్బు కోసం హత్యలు - తెలిసిన వాళ్లే మహిళల ముఠా టార్గెట్​ - Murders by Womens Gang

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 8:30 PM IST

Updated : Sep 6, 2024, 10:35 PM IST

Murders with Cyanide: డబ్బు కోసం చుట్టుపక్కల వారిని సైనైడ్​తో చంపుతున్న ఘటనలు గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించాయి. మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ముగ్గురు మహిళలు ముఠాగా ఏర్పడి ఈ ఘాతుకాలు చేస్తున్నట్లు తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. ఈ ముఠా చేతిలో పడి నలుగురు మరణించగా మరో ముగ్గురు తప్పించుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ వాలంటీర్ ఒకరు కీలక నిందితురాలిగా ఉండటం విశేషం.

Murders with Cyanide
Murders with Cyanide (ETV Bharat)

Women Gang Murders in Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో ఈ ఏడాది జూన్ 5వ తేదీన గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి పంపించారు. మహిళ ఎవరని విచారించగా తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీకి చెందిన నాగూర్ బీగా గుర్తించారు. మృతదేహంలో సైనైడ్​ ఆనవాళ్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. దీంతో హత్య జరిగిందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.

సతీష్‌కుమార్‌, ఎస్పీ (ETV Bharat)

తెనాలి, చేబ్రోలు మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించగా జూన్ 2వ తేదీన మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆటోలో వచ్చినట్లు గుర్తించారు. ఆ మహిళల్ని పట్టుకుని విచారించగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. డబ్బు కోసం నాగూర్ బీని బ్రీజర్​లో సైనైడ్​ కలిపి తాగించి చంపినట్లు అంగీకరించారు. ఆటోలో వడ్లమూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వచ్చి నాగూర్ బీని చంపి ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారు తీసుకెళ్లారు. వీరిలో ఒకరు మాజీ వాలంటీర్ వెంకటేశ్వరి కాగా మరొకరు ఆమె తల్లి రమణమ్మగా గుర్తించారు.

Murders for Cash: గతంలో కూడా ఇలాంటి హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2022లో వెంకటేశ్వరి అత్త సుబ్బలక్ష్మిని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆమె నివాసంలో ఎవరికీ అనుమానం రాకుండా మద్యంలో సైనైడ్​ కలిపి చంపారు. 2023 ఆగస్టులో తెనాలికి చెందిన నాగమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలికి శీతల పానీయంలో సైనైడ్​ కలిపి ఇచ్చారు. ఆమె వయోభారంతో చనిపోయారని అందరూ భావించారు. 2024 ఏప్రిల్​లో మోషే అనే వ్యక్తిని ఇదే తరహాలో చంపారు. మోషే మద్యం తాగి వచ్చి తన భార్యతో గొడవలు పడుతుండేవాడు.

అతనిని చంపితే ఇన్సూరెన్స్, పింఛన్​లో వాటా వస్తుందనే మోషే భార్య భూదేవితో కలిసి మద్యంలో సైనైడ్​ కలిపి చంపారు. మొదటి మూడు హత్యలు ఇళ్లలోనే జరిగాయి. అనారోగ్యం, వయోభారం వల్ల చనిపోయారని అంతా భావించారు. ఎవరికీ అనుమానం రాలేదు. కానీ నాగూర్ బీ హత్య బయటి ప్రాంతంలో జరగటంతో పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసుల విచారణలో వెంకటేశ్వరి, రమణమ్మ, భూదేవి నిందితులుగా తేలింది.

నాగూర్ బీని సైనైడ్​తో చంపారనే విషయం బయటకు రాగానే పొన్నూరు, చేబ్రోలు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వర రావు, చేబ్రోలు ఎస్ఐ వెంకట కృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ముందుగా వెంకటేశ్వరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె తల్లి రమణమ్మని, భూదేవిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిని హత్య చేయగా వారిలో ముగ్గురు తెనాలి యడ్ల లింగయ్య కాలనీకి చెందినవారు. హత్యకు పాల్పడిన ముగ్గురు కూడా అదే కాలనీలో నివాసం ఉంటున్నారు.

తమకు తెలిసిన వారినే లక్ష్యంగా ఎంచుకుని ఇలా హత్యలకు పాల్పడటం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరో ముగ్గురిని కూడా వీరు చంపాలని భావించినా వీరి కుట్రలు ఫలించలేదు. సైనైడ్​ కలిపిన ఆహారం, పానీయాలు వారు తీసుకోకపోవటంతో ప్రాణాలతో బయటపడ్డారు. మహిళలకు సైనైడ్​ సరఫరా చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరి కొంత కాలం కంబోడియా దేశం వెళ్లింది. అక్కడి వారితో కలిసి సైబర్ నేరాలకు పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

తెనాలికి చెందిన నాగూర్‌ బి అనే మహిళను నమ్మకంగా నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి బీజర్‌లో సైనైడ్‌ ఇచ్చి చంపేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఎవరికి అనుమానం రాలేదు. పోలీసులు ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించడంతో తెనాలికి చెందిన వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ సైనెడ్‌తో వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు తోడు మరో మహిళ కూడా కలిసి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. బుజ్జి తన అత్తకు కూడా సైనెడ్‌ ఇచ్చి చంపింది. ఆ తర్వాత తెనాలిలో ఓ వృద్ధురాలి వద్ద డబ్బు, బంగారం చూసి ఆమెను ఇదే తీరులో హతమార్చారు. -సతీష్‌కుమార్‌, ఎస్పీ

ప్రస్తుతం నాగూర్ బీ హత్యకు సంబంధించి మాత్రమే కేసు నమోదైంది. మిగతా ముగ్గురి హత్యలకు సంబంధించి తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్​తో పాటు మార్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హతుల బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టనున్నారు.

జల్సాలకు అలవాటు పడి - అప్పిచ్చిన వాళ్లనే చంపేసిన వైద్యుడు - Doctor Commits Murders

Last Updated : Sep 6, 2024, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details