ఆంధ్రప్రదేశ్

andhra pradesh

2040 నాటికి తీరంలో ఐదు శాతం భూభాగం కోల్పోనున్న విశాఖ - నిపుణుల అంచనా - Visakhapatnam Coastal Area Loss

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 10:58 AM IST

Study on Visakhapatnam Coastal Area: విశాఖ సాగర అందాలు మాటలకందనివి. ప్రకృతి ప్రేమికులను, దేశ, విదేశీ పర్యాటకులను  అబ్బురపరిచే ఆ నీలిసంద్రమే కాలక్రమంలో మున్ముందుకు దూసుకొచ్చి ఇసుక తిన్నెలను మింగేస్తుందా? తీరం వెంబడి కొంత భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

Study on Visakhapatnam Coastal Area
Study on Visakhapatnam Coastal Area (ETV Bharat)

Study on Visakhapatnam Coastal Area :వాతావరణం వేడెక్కితే సముద్రం ముందుకొస్తుందా? ఫలితంగా తీరం వెంబడి భూభాగం కనుమరుగవుతుందా? అంటే అవుననే పరిశోధనలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు కారణంగా తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉంది. ఇదే విషయాన్ని బెంగళూరుకు చెందిన సెంటర్‌ ఫర్‌ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్‌ పాలసీ (సీఎస్‌టీఈపీ) తాజాగా పేర్కొంది.

ఈ అధ్యయనం ప్రకారం 2040 నాటికి విశాఖ సాగర తీరం వెంబడి 1-5% భూభాగాన్ని కోల్పోయే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు. అంటే సముద్రం ముందుకు చొచ్చుకొస్తే ఏర్పడే కోతతో తీరం వెంబడి ఇసుక తిన్నెల్లో 6.96-7.43 చదరపు కి.మీ. మేర భూమి సముద్రంలో కలిసిపోతుంది. ఈ తాజా వివరాలు విశాఖ వాసులను కలవరపెడుతున్నాయి. కర్బన ఉద్గారాల శాతం భారీగా పెరిగితే 2100 నాటికి 61.58 చదరపు కి.మీ. తీరం సముద్రంలో కలిసిపోతుంది.

ఆర్కే బీచ్‌ రోడ్డు బోసిపోతుందా?!! చర్చనీయాంశంగా జీవో నెం 1పరిణామాలు

సముద్రం కోత - కలత :ఉమ్మడి విశాఖ పరిధిలో 131 కి.మీ. సముద్ర తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి 43 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వాటిలో 15 గ్రామాల వద్ద తీరం తరచూ కోతకు గురవుతోంది. గతేడాది 25.8 కి.మీ. పరిధిలో కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. యారాడ నుంచి పరిశీలిస్తే యారాడ బీచ్, కోస్టల్‌ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం, చిల్డ్రన్‌ పార్కు, జోడుగుళ్లపాలెం, రుషికొండ, మంగమారిపేట, భీమిలి పరిధిలో తీరం ఎక్కువగా కోతకు గురవుతోంది. 2014లో హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఆర్కే బీచ్‌ పరిధిలో కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది.

కారణాలు :వాతావరణం వేడెక్కడంతో మంచుకొండలు కరగడమే సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణం. సహజమైన ఇసుక బంగాళాఖాతంలో దక్షిణం నుంచి ఉత్తరానికి రావాల్సి ఉండగా, అవాంతరాలు ఏర్పడుతున్నాయి. విశాఖ తీరంలో కొండలు సముద్రంలోకి చొచ్చుకొని ఉండటమూ ఓ కారణం. ఉదాహరణకు యారాడ కొండ కారణంగా ఇసుక సహజ ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో యారాడ కొండకు మరోవైపు ఉన్న ఆర్‌కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం వద్ద కోత ఎక్కువగా ఉంటుందని సముద్ర అధ్యయన విభాగం విశ్రాంత శాస్త్రవేత్త కేఎస్‌ఆర్‌ మూర్తి 'ఈనాడు'తో తెలిపారు.

పర్యాటకానికి ఏపీ చిరునామా కావాలన్న జగన్‌ - అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వరే!

కోత కట్టడికి చర్యలు : అక్కడ :పుదుచ్చేరిలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రొమినేడ్‌ బీచ్‌లో గ్రోయన్‌ నిర్మాణంతో పాటు, ఏటా 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తీరంలో వేస్తూ కోతకు కట్టడి కృషి చేస్తున్నారు. కేరళలోని అరేబియా సముద్రం తీరంలో చెల్లానం తీరంలో రూ.300 కోట్లకు పైగా వెచ్చించి ఆరు కి.మీ. మేర రక్షణ గోడ నిర్మించారు.

ఇక్కడ :విశాఖ తీరంలోనూ తీర ప్రాంత కోత నివారణకు విశాఖ పోర్టు అథారిటీ డ్రెడ్జర్ల(తవ్వోడ)తో డ్రెడ్జింగ్‌ చేయిస్తోంది. ఏటా ఏప్రిల్, మే నెలలో డ్రెడ్జింగ్‌ ద్వారా వచ్చే ఇసుకను పైపుల ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో వేస్తున్నారు. ఇదే కాకుండా పకడ్బందీ చర్యలు మరింత ముమ్మరం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పరిశుభ్రత పాటించాలి - 'విశాఖ ఆర్కే బీచ్‌ క్లీనింగ్'లో సినీ నటి లావణ్య త్రిపాఠి

ABOUT THE AUTHOR

...view details