తెలంగాణ

telangana

ఇకపై వేములవాడలో వీఐపీ బ్రేక్ దర్శనం - ఒక లడ్డూ ఫ్రీ - టికెట్​ ధర ఎంతంటే? - Vemulawada VIP Break Darshan

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 3:36 PM IST

Vemulawada VIP Break Darshan : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి రూ. 300 టికెట్ ధరగా నిర్ణయించారు. దీంతో పాటు ఒక లడ్డును ఉచితంగా ఇవ్వనున్నారు.

Vemulawada VIP Break Darshan
వేములవాడ VIP బ్రేక్ దర్శనం (ETV Bharat)

Vemulawada VIP Break Darshan :దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజురోజుకూ వీఐపీ భక్తుల సంఖ్య పెరగడం వల్ల బ్రేక్‌ దర్శనానికి శ్రీకారం చుట్టారు ఆలయ అధికారులు. శ్రావణమాసం తొలిరోజైన సోమవారం ఈ బ్రేక్​ దర్శనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే​ ఆది శ్రీనివాస్​. ఈ బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి రూ. 300 టికెట్ ధరగా నిర్ణయించారు ఆలయ అధికారులు.

ఇందులో భాగంగా బ్రేక్‌ దర్శనం చేసుకునే ప్రతి భక్తుడికి 100 గ్రాముల లడ్డును ఉచితంగా అదించనున్నారు. ఈ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 10 :15 గంటల నుంచి 11: 15 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అనుమతించనున్నారు. ఈఓ కార్యాలయం ముందున్న ప్రస్తుత శీఘ్ర దర్శనం క్యూలైన్‌ను బ్రేక్‌ దర్శనానికి ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.

'కేసీఆర్​ మాట తప్పారు'
బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించిన అనంతరం ఆది శ్రీనివాస్, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ 2016 జూన్​లో స్వామి వారిని దర్శించుకుని ఏటా ఆలయ అభివృద్ధికి బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. తన వివాహం ఇక్కడే జరిగిందని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రంగురంగుల బ్రోచర్లతో మాత్రమే అభివృద్ధిని చూపారని ఎద్దేవా చేశారు.

రూ. 50కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు
రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధిని తన బాధ్యతగా భావిస్తున్నట్లు విప్ ఆది శ్రీనివాస్​ చెప్పారు. వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీకి (VDTDA) గత ప్రభుత్వ హయాంలో మంజూరై, వెనక్కి వెళ్లిన రూ. 20 కోట్లను తిరిగి తెప్పించానని తెలిపారు. దీంతో పాటు ప్రస్తుత బడ్జెట్లో రూ. 50 కోట్లు అభివృద్ధికి కేటాయించినట్లు వివరించారు. ఆలయ అభివృద్ధి సూచనల కోసం శృంగేరి పీఠాన్ని సందర్శించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రూ. 50 కోట్లతో చేపట్టే పనులకు అంచనాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. భక్తి భావం ఆధ్యాత్మికత ఉట్టి పడేవిధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

వేములవాడలో భక్తులకు తప్పని పాట్లు - ఆదాయం పెరిగిన చర్యలు తీసుకోని అధికారులు

అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం - వేములవాడ గుడిలో 13 మంది ఉద్యోగులపై చర్యలు - ACTIONS ON RAJANNA TEMPLE OFFICERS

ABOUT THE AUTHOR

...view details