Mumbai Actress Kadambari Jethwani Case Updates :ముంబయి నటి కాదంబరీ జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
వారిపై కేసు నమోదు చేయాలన్న ముంబయి నటి :మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని కాదంబరీ జత్వానీ ఫిర్యాదు చేశారు. వీరంతా కుమ్మక్కై చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర, పాల్తో కలసి ఆమె విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్కు ఈ మేరకు ఆమె ఫిర్యాదును అందజేశారు. ఆమె వెంట తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ ఉన్నారు.
విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, హుటాహుటిన అక్రమంగా కేసు నమోదు చేసి, తనతో పాటు తల్లిదండ్రులను ముంబయిలో అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాలపై ముంబయి వచ్చి ముగ్గుర్ని అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.