Tips and Tricks in Telugu to Prepare for CBSE Board Exams : సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. 2025 ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఇంకా రెండున్నర నెలలకు పైగా సమయం ఉండటంతో ఇప్పటినుంచే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే టాపర్గా నిలవడం కష్టమేమీ కాదు. ఈ పరీక్షల్లో రాణించాలి అంటే ప్రతి విద్యార్థీ కొన్ని ప్రిపరేషన్ టిప్స్ పాటించాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
- ఏ పరీక్ష రాయాలన్నా ముందుగా సిలబస్, ప్యాటర్న్ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. సిలబస్ ఏంటో తెలిస్తేనే దానికనుగుణంగా స్టడీ ప్లాన్ చేసుకోవచ్చు. పరీక్షలను సన్నద్దమయ్యే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకుని, దాని ప్రకారం సన్నద్ధత మొదలు పెడితేనే మంది ఫలితాలు వస్తాయి. గతంలో ఏయో చాప్టర్లకు ఎంత వెయిటేజీ ఇచ్చారు దాని ఆధారంగా ఆయా చాప్టర్లకు ప్రియారిటీ ఇవ్వడం ద్వారా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
- ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్టమైన సమయాలను కేటాయించేలా స్టడీ షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఒత్తిడిని నివారించి ఉత్పాదకతను మెరుగుపరుచుకొనేలా స్టడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కాస్త విరామం ఉండేలా చూసుకోవాలి.
- ప్రిపరేషన్లో కొన్ని సబ్జెక్టులు/ చాప్టర్లను వదిలేసి మార్కుల కోసం కొన్నింటిపైనే దృష్టి పెట్టడం లాంటివి చేయకూడదు. ఈ రకమైన నిర్లక్ష్య ధోరణితో ప్రమాదంలో పడే అవకాశముంది. పరీక్షల్లో ప్రతి సబ్జెక్టు/చాప్టర్లు అత్యంత కీలకం. ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేసినా అది మార్కులపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి.
- ఏ సబ్జెక్టయినా సరే అందులోని ప్రాథమిక అంశాలపై పట్టు పెంచుకోవాలి. మరింత లోతైన అవగాహన కోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఒక మంచి వనరుగా ఉపయోగించుకోండి. బట్టీ పట్టి చదవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదు.
ఇక తెలుగు మీడియంలోనే 'పది' పరీక్షలు రాయొచ్చు
- పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేయడం వల్ల ఏయో పాఠ్యాంశాల నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వచ్చాయో అర్థమవుతుంది. కనీసం ఐదు నుంచి పదేళ్ల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేయడం ఉత్తమం. తద్వారా ప్రాధాన్యతలు నిర్ణయించుకొని ప్రాక్టీసు చేస్తుంటే పరీక్ష రాయడంలో వేగం పెరగడంతో పాటు కచ్చితత్వం మెరుగుపడుతుంది.
- ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు రాస్తుండాలి. పరీక్ష సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేసేందుకు మాక్ టెస్టు సరీస్ తీసుకోవాలి. తద్వారా మీ అధ్యయన తీరును విశ్లేషించుకొని ఎక్కడ వెనుకబడి ఉన్నారో ఆ అంశాలను రివైజ్ చేసుకొనే ప్రయత్నం చేయాలి.
- విద్యార్థులకు నిద్ర చాలా అవరసరం. సరిపడ గాఢనిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి, అకడెమిక్ పెర్ఫామెన్స్పైనే కాదు వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. పరీక్షల సమయంలో నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. రోజూ తగినంత నిద్రపోవడం వల్ల ఫోకస్ పెరగడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. నేర్చుకొనే ప్రక్రియలో ఎంతో కీలకమైన నిద్రను ఈ పరీక్షల సీజన్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి.