Telangana Officials Prepare Plans to Auction Rajiv Swagruha Propertie : ఖాళీగా ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలను వేలంలో విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిసెంబరులో దశల వారీగా అమ్మకాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ కసరత్తులు ప్రారంభించింది. వీటితో రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణంతోపాటు ప్లాట్ల విక్రయం చేపట్టాలని నిర్ణయించి భూములను బదలాయించింది. అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి విక్రయించింది.
ఈ క్రమంలో ఇళ్లు, స్థలాలు పెద్ద మొత్తంలో మిగిలిపోయాయి. ప్రస్తుతం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం అమలుకు నిధులను సమకూర్చుకునేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో స్థలాల, నిర్మాణాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు మూడు ఉన్నత స్థాయి కమిటీలను నియమించింది. ఆయా కమిటీలు ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. వాటిపై సమీక్షించిన అనంతరం దశల వారీగా విక్రయాలు చేపట్టేందుకు సర్కారు చర్యలు చేపడుతుంది.
సింహభాగం గ్రేటర్ పరిధిలోనే :విక్రయానికి సిద్ధం చేస్తున్న వాటిల్లో ఎక్కువ భాగం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోనే ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో రూ.1,600 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల వరకు జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ 760 ఫ్లాట్లు ఉండగా, పలు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు నిర్మించారని, వాటిల్లో 36 అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించామని వివరించారు.