Telangana High Court On Student Certificates : సర్టిఫికెట్ అన్నది విద్యార్థి ఆస్తి అని దానిపై పాఠశాలలు తాత్కాలిక హక్కులు పొందజాలవని హైకోర్టు పేర్కొంది. బకాయిలున్న కారణంగా సర్టిఫికెట్లను నిలిపివేయడం సరికాదంది. రాజ్యాంగం ప్రకారం విద్య ప్రాథమిక హక్కు అని పాఠశాలలకు మద్దతు తెలుపుతూ అధికారులు అనుచితంగా వ్యవహరించరాదన్నారు. ఏ కారణం చేతనైన ఒక పాఠశాల నుంచి మరో స్కూల్కు వెళ్లే హక్కు విద్యార్థికి ఉందని దాన్ని ఆయా యాజమాన్యాలు నిరాకరించకూడదని స్పష్టం చేసింది.
ఫీజు బకాయిలు ఉన్నట్లయితే వాటిని తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకోవడానికి సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చంది. అంతేకానీ సర్టిఫికెట్లను ఉంచుకుని ఫీజు చెల్లించాలన్న ప్రయత్నాలు సమర్థనీయం కాదని పేర్కొంది. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది.
ఇదీ జరిగింది :పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీ సిద్ధార్థ హైస్కూల్ తమ పిల్లల టీసీలను జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కరీంనగర్కు చెందిన వి.దినేష్ మరో 42మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫీజులు చెల్లించినా ఆక్రమంగా మరింత డిమాండ్ చేస్తూ టీసీలను జారీ చేయడం లేదన్నారు. పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు మరో పాఠశాల పిల్లలకు అడ్మిషన్ ఇచ్చిందని, అయితే టీసీలు సమర్పించాలని షరతు విధించిందని చెప్పారు.
'పాఠశాల సర్టిఫికేట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై ప్రభుత్వ విధానమేంటి?' - Tg HC on Caste and Religion Option
శ్రీ సిద్దార్ల పాఠశాల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమ పాఠశాలలో ఐదు వందల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. కానీ ఓ వ్యక్తి విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవపట్టించి వారిని మరో పాఠశాలలో చేర్పించారని చెప్పారు. వారి నుంచి 2019 నుంచి 2022 దాకా ఫీజు బకాయిలు రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. కేవలం ఫీజు కారణంగా సర్టిఫికెట్లను ఉంచుకోవడం చెల్లదంటూ ఇదే హైకోర్టు 2020లో తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. ఫీజు గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని ఫీజు చెల్లించలేదన్న కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉంచుకోవడాన్ని చట్టం అనుమతించదని స్పష్టం చేశారు.
మద్రాస్, దిల్లీ హైకోర్టులు వెలువరించిన తీర్పుల్లో సర్టిఫికెట్లను ఉంచుకోవడం చెల్లదని పేర్కొన్న విషయాన్నిఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. అందువల్ల ఫీజు చెల్లించేదాకా టీసీలు జారీ చేయకుండా ఉండజాలదని అభిప్రాయపడ్డారు. ఫీజు బకాయిలను రాబట్టుకోవడానికి సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని, సర్టిఫికెట్లు ఉంచుకుని ఒత్తిడి తీసుకురావద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రతి అందిన 2 వారాల్లో విద్యార్థులకు టీసీలను అందజేయాలని శ్రీసిద్ధార్థ హైస్కూలుకు ఆదేశాలు జారీ చేసింది.
'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు'