తెలంగాణ

telangana

''పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా కల్పించండి - మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి' - Union Budget 2024 Meeting

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 7:09 AM IST

Union Budget 2024 Meeting : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో పలు అంశాలను రాష్ట్రం తరఫున ప్రస్తావించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల బకాయిలు ఇవ్వడంతో పాటు మరో ఐదేళ్లు కొనసాగించాలని, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రుణ పరిమితి సీలింగ్‌ను బడ్జెట్ సమయంలోనే ఖరారు చేయాలని కోరారు.

Union Budget 2024 Meeting
Union Budget 2024 Meeting (ETV Bharat)

Telangana Govt Proposals in the Union Budget Meeting : అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది. సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్రం నుంచి అందాల్సిన సహకారాన్ని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి, కొన్ని అంశాలను ప్రత్యేకంగా తెలిపారు.

రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ఏడాదికి రూ.రెండున్నర లక్షల కోట్లకు పెంచడంతో పాటు షరతులు, ఇతర పరిమితులు లేకుండా నిధులను విడుదల చేయాలని కోరారు. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను పునః సమీక్షించి, అనవసరమైన పథకాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలని సూచించారు. నిరుద్యోగం, ఆదాయ పంపిణీలో అసమానతలు దేశంలో ఉన్న ప్రధాన సమస్యలుగా పేర్కొన్న భట్టి విక్రమార్క, ఈ రెండు సమస్యల కోసం బడ్జెట్‌లో కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటికి ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఐటీఐలను ఏటీసీలుగా మార్చే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ సమస్యను అధిగమించేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని, రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రత్యేక ఆర్థిక సహాయంతో ఆధునీకరించాలని సమావేశంలో భట్టి ప్రతిపాదించారు.

సెస్​లు, సర్​ ఛార్జీల పెంపు రాష్ట్రాలకు నష్టం :ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గడంతో పాటు సెస్‌లు, సర్ ఛార్జీల ద్వారా సేకరించిన మొత్తం పెరగడంతో రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సెస్‌లు, సర్ ఛార్జీలు మొత్తం పన్ను ఆదాయానికి పది శాతం మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రాల రుణపరిమితిని బడ్జెట్​ తర్వాత కేంద్రం ఖరారు చేస్తున్నందున ప్రణాళిక ఇబ్బంది అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

అలాగే బడ్జెట్​ ప్రవేశపెట్టే సమయంలోనే సీలింగ్​ తెలిపితే రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలపై తమ వనరులను సమర్థంగా ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఉపముఖ్యమంత్రి కేంద్ర ఆర్థికమంత్రి ముందు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించడంతో పాటు, జాతీయ ఆర్థికవ్యవస్థకు విలువైన భాగస్వామిగా ఉందన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం చూపాల్సిన సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు.

రాష్ట్రాల జనాభా నిష్పత్తిన కేంద్ర పథకాల నిధులు పంచాలి : కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలని భట్టి కోరారు. ఏకపక్షంగా నిధుల విడుదల, కొన్ని రాష్ట్రాల పట్ల పక్షపాతం లేకుండా చూడాలని అన్నారు. 2023-24లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం రూ.4,60,000 కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం 1.4 శాతం మేర రూ.6,577 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. జనాభా నిష్పత్తి లేదా ఏ ఇతర విధానం ప్రకారం అయినా ఈ మొత్తం చాలా తక్కువ అని భట్టి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 94(2) కింద, రాష్ట్రానికి ప్రతి ఏటా రూ.450 కోట్లు ఇవ్వాలని ఆ ప్రక్రారం రూ.2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదని చెప్పారు. ఆ మొత్తాన్ని విడుదల చేయడంతో పాటు హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గ్రాంటును వచ్చే ఐదేళ్ల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి పొరపాటుగా వెళ్లిన రూ.495 కోట్ల గ్రాంటు తిరిగి ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై పరిమితులు తొలగించాలని అన్నారు.

మూసీ నదికి పునరుజ్జీవం : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. భారీ వ్యయమయ్యే ఈ కార్యక్రమానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీజనల్​ రింగ్​ రోడ్​ పూర్తి చేసేందుకు నిధులు కేటాయించి సహకరించాలని, రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాని సూర్యఘర్‌లో విద్యుత్ రాయితీ - ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద రాష్ట్రం సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలన్నారు. అలా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. వీటితో పాటు పలు అంశాలు, ఇతర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.

ఇకపై ఫ్లాట్‌ఫామ్‌ టికెట్స్, బ్యాటరీ కార్లకు నో GST!- కౌన్సిల్ మీటింగ్​లో మరిన్ని నిర్ణయాలు ఇవే!! - GST Council Meeting

'కేంద్ర సర్కార్​ పన్ను విధానంతో రాష్ట్రాల ఆదాయానికి గండి - సర్‌ ఛార్జీలు, సెస్‌లు 10 శాతానికి మించకూడదు' - Union Budget Preparatory Meeting

ABOUT THE AUTHOR

...view details