Health Checkups in Telangana 2024 : తెలంగాణలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. పెద్దలందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకుగాను పది మొబైల్ ల్యాబ్లను సిద్ధం చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కార్యక్రమంలో భాగంగా చేపట్టే ఈ క్రతువుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర సర్కార్ 40 శాతం నిధులు సమకూర్చనున్నాయి.
Telangana Health Screening Tests : గత 20 సంవత్సరాల్లో రాష్ట్రంలో హృద్రోగాలు, రక్తపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మద్యపానం, జంక్ఫుడ్స్, ధూమపానం కారణంగానే దాదాపు 60 శాతం వరకు వ్యాధులు వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్కు సంబంధించి ఒక శాతం లోపే మహిళలు ముందస్తు పరీక్షలు చేయించుకుంటున్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది వంద శాతం వరకు ఉంటోంది. గ్రామీణ స్థాయి నుంచి ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆయా వ్యాధులను నిర్ధారించి, సకాలంలో వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏయే పరీక్షలంటే : ఊరూరా తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో 26-70 సంవత్సరాల వయసున్న అందరికీ డిజిటల్ మామోగ్రామ్, ఈ2డీ ఏకో, పాప్స్మైర్, ఈసీజీ ఇతర అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తారు. అందుకనుగుణంగా మొబైల్ ల్యాబ్లో వైద్యులతోపాటు నర్సులు ఇతర టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. ప్రధానంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము, మధుమేహం, అధిక రక్తపోటు, నోటి క్యాన్సర్లు, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.