ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంశీ పాపాలపుట్ట బద్దలైంది - వల్లభనేని అరెస్టుపై టీడీపీ నేతలు - TDP LEADERS ON VAMSI ARREST

గన్నవరం వంశీ పాపాలపుట్ట బద్ధలైందన్న టీడీపీ నేతలు - ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారని ధ్వజం - వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని జైలుకెళ్లే సమయం దగ్గరపడిందని జోస్యం

TDP Leaders Respond On Ex Mla Vallabhaneni Vamsi Arrest
TDP Leaders Respond On Ex Mla Vallabhaneni Vamsi Arrest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 4:19 PM IST

Updated : Feb 13, 2025, 4:58 PM IST

TDP Leaders Respond On Ex Mla Vallabhaneni Vamsi Arrest : అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన నోరుపారేసుకున్న వంశీకి ఇప్పటికి సరైన గతి పట్టిందని తెలుగుదేశం నేతలు అన్నారు. గత ఐదేళ్లలో గన్నవరంలో వంశీ చేయని అరాచకం లేదన్న టీడీపీ నేతలు రాజకీయ భిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనే దాడికి దిగడం దారుణమన్నారు. పైగా దళితుడైన ఫిర్యాదుదారుని కిడ్నాప్‌ చేసి బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేయడం క్షమించరాని నేరమన్నారు. చేసిన పాపాలకు వంశీ ఫలితం అనుభవించక తప్పదన్న నేతలు గత ఐదేళ్లలో గన్నవరంలో జరిగిన మట్టి దందా, అక్రమ కబ్జాలు, దారుణాలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు.

శాశ్వతంగా కటకటాల్లోకి :తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ అని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తిని 9 నెలలుగా ఎందుకు వదిలేశారో అర్థంకావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ మాట్లాడిన భాష, చేసిన నేరాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. గతంలో అధికారం అండతో వంశీ తనపై దాడికి పన్నిన పన్నాగంపై కేసు పెట్టినా పోలీసులు తీసుకోలేదన్న నాదెండ్ల బ్రహ్మం ఇప్పుడు ఆ కేసులోనూ దర్యాప్తు ప్రారంభించాలని పోలీసుల్ని కోరారు.

వారిని వదిలే ప్రసక్తే లేదు : దాడికి ప్రతి దాడి, కక్ష తీర్చుకునే అవసరం టీడీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందన్న ఆయన, కక్ష సాధింపు చేస్తే వచ్చిన నెల రోజుల లోపే అరెస్టు చేసి ఉండొచ్చని అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకునే పరిస్థితి లేదని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి దానిని వెనక్కు తీసుకోవడం తమ అందరికీ ఆశ్చర్యం కలిగించిందన్నారు. సత్యవర్ధన్ తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు, నేతలను తీవ్ర స్థాయిలో వేధించారని గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడో? : గన్నవరం వంశీ పాపాలపుట్ట బద్దలైందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెద్ద సైకో జగన్ డైరక్షన్ లో వ్యవహరించిన చిన్న సైకో వంశీ కటకటాల పాలయ్యాడని తెలిపారు. ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, చట్టాన్నే కించపరిచాడని ధ్వజమెత్తారు. వంశీ అరెస్ట్ సమయంలో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడో కాల్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వంశీతో పాటు కొడాలినాని, పేర్ని నాని లాంటి వాళ్లు జైలుకెళ్లే సమయం దగ్గరపడిందని వెల్లడించారు.

నోరుంది కదా అని బూతులు : గన్నవరం పార్టీ కార్యాలయం తగలపెట్టి చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు వంశీ మరో నేరానికి పాల్పడ్డాడని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అధికారం అండతో వైఎస్సార్సీపీ నాయకులు కృష్ణా జిల్లాలో పెట్రేగిపోయారని దుయ్యబట్టారు. ఒక నాయకుడు క్యాసినో పెట్టి నోరుంది కదా అని బూతులు తిట్టాడు,మరో నాయకుడు బియ్యం స్కామ్ లో కట్టుకున్న భార్యనే ఇరికించాడన్నారు. ఇంకో నాయకుడు పార్టీ కార్యాలయం పై దాడికి పాల్పడతాడు ఈ చర్యలన్నీ ఉపేక్షించాలా? అని ప్రశ్నించారు. కక్షపూరితంగా చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లమని తెలిపారు.

విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తాం : అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం సంస్కృతి వైఎస్సార్సీపీదేనని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ధ్వజమెత్తారు. గన్నవరం పార్టీ కార్యాలయం ధ్వంసం చేయటంతో పాటు తెలుగుదేశం నాయకులపైనే ఎదురు కేసులు పెట్టింది వైసీపీ కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సత్యవర్ధన్ ను వంశీ బెదిరించి, ప్రలోభపెట్టింది వాస్తవం కదా అని నిలదీశారు. రక్షణ కోసం కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయిస్తే చర్యలు తీసుకోకూడదా అని మండిపడ్డారు. వంశీ అన్ని అక్రమాలపై విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తామని స్పష్టం చేశారు.

గన్నవరంలో నరకాసురుడు అంతం : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరంలో నరకాసురుడు అంతం జరిగిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య వ్యాఖ్యానించారు. వంశీ అరెస్టుతో గన్నవరం ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. పట్టిసీమ మట్టిని కొట్టేసిన వాడు, అప్పటి ఇరిగేషన్ మంత్రిని బూతులు తిట్టినా వాడు, తమ పార్టీ నుంచి వచ్చిన వాడు, ఒక్క కేసు కాదు, ఒక్క నేరం కాదు అనేక నేరాలు చేశాడని వర్లరామయ్య ధ్వజమెత్తారు. ఒక్క టీడీపీ ఆఫీస్ ధ్వంసం మాత్రమే కాదు చాలా నేరాలు చేశాడన్న ఆయన, అటువంటి వాడ్ని అరెస్టు చేయటం సరైనదేననన్నారు. తప్పకుండా శిక్ష అనుభవించాలని అన్నారు. ఇలాంటి వారే ఇంకా ఇద్దరు ముగ్గురు వున్నారని, కాస్త ఆలస్యం అయిన వాళ్లని కూడా అరెస్టు చేస్తామన్నారు. విజయవాడ పోలీసులను వర్లరామయ్య అభినందించారు. కలుగులో దక్కున వాడ్ని అరెస్టు చేశారన్నారు.

నియోజకవర్గానికే చెడ్డపేరు : ఎందరో మహానుభావులు గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే, వంశీ ఒక్కడే నియోజకవర్గానికి చెడ్డపేరు తీసుకొచ్చాడని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ధ్వజమెత్తారు. మట్టి అక్రమాలతో పాటు దొంగ ఇళ్లపట్టాలు, భూ కబ్జాలు వంటి అవినీతికి వంశీకి పాల్పడ్డారని ఆరోపించారు. వంశీ అక్రమాలపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వంశీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మార్వోలుగా చేసిన వారిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వంశీ వ్యవహారంతో గన్నవరం ప్రజల విలువులు కూడా దిగజారిన పరిస్థితి నెలకొందన్నారు. తాను వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు తనను కూడా అసభ్యపదజాలం వాడమని జగన్ ఒత్తిడి తెచ్చినా నోరు జారలేదని వెల్లడించారు.

తల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దాడి : వల్లభనేని వంశీ లాంటి వారిని వేటాడే ఆట మొదలైందని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం వ్యాఖ్యానించారు. వంశీ, దేవినేని అవినాష్, కొడాలి నాని చీడపురుగులని ఆయన మండిపడ్డారు. కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దుర్మార్గులని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వంశీకి తగిన శాస్తి జరిగిందని అన్నారు. వంశీ అరెస్టుతో కూటమికి ఓటేసిన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. నారా లోకేశ్ రెడ్ బుక్ ఓపెన్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈరోజు నుంచి తెలుస్తుందని బ్రహ్మం అన్నారు. వంశీ, ఆయన అనుచరులు తన ఇంటి పైన దాడికి వచ్చిన సందర్భంలో ఆనాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని నాదెండ్ల బ్రహ్మం కోరారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీ అరెస్టు

వంశీ లెక్కలు తేల్చేందుకు సిద్ధమైన సర్కార్! - అరాచకాలపై కూలంకషంగా దర్యాప్తు

Last Updated : Feb 13, 2025, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details