తెలంగాణ

telangana

సిద్దిపేట డిగ్రీ కళాశాలలో పీజీ కొత్త కోర్సులు - ఉపాధికి ఊతమిస్తూ నయా రూపకల్పన - PG New Courses in Siddipet

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 4:35 PM IST

Siddipet Govt Degree College PG New Courses : పీజీ పూర్తకాగానే, కొందరు తమ విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగాల కోసం అన్వేషిస్తారు. ఏదో ఒక చిన్న కొలువుతో సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం నైపుణ్యాలకు సానపెట్టుకోవడంపై దృష్టిపెడతారు. ఐతే, పీజీలోనే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా, సిద్దిపేట డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీలో కొత్త కోర్సుల్ని అందుబాటులోకి తెచ్చారు.

PG Adjunct New Courses in Siddipet Govt Degree College
Siddipet Govt Degree College PG New Courses (ETV Bharat)

PG Adjunct New Courses in Siddipet Govt Degree College :సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఎమ్మెస్సీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఫిషరీస్‌, ఎంఏ తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, ఎంకామ్‌ కోర్సులు కొనసాగుతున్నాయి. ఆయా కోర్సుల్లో 60 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. మెుత్తం 630 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌, మైక్రోబయోలజీ కోర్సులు రావడంతో, ప్రథమ సంవత్సరంలో 120 సీట్లు భర్తీకి అవకాశం కల్పించారు.

సెప్టెంబర్‌ నుంచి పీజీలో ప్రవేశాలు మెుదలుకానున్నాయి. కొత్త వాటితో సహా మెుత్తం ప్రోగ్రామ్స్‌ సంఖ్య 12కి చేరడం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో, బీకాం ఫైనాన్స్‌ అనే కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఇంగ్లండ్‌లోని గ్లాస్గో యూనివర్సిటీతో ఎంవోయు కుదుర్చుకున్నారు. ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌తోపాటు ప్రతిభ కనబరిచిన వారికి ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకున్నారు.

పీజీ పూర్తవగానే ఉద్యోగ, ఉపాధి లభించేలా కోర్సుల రూపకల్పన : రెండేళ్ల కాల వ్యవధిలో కొనసాగే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో 20 కోర్సులు ఉంటాయి. అందులో డేటాబేస్‌ కాన్సెప్ట్స్‌, ఏఐ అప్లికేషన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఫైనల్‌ సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ప్రాంగాణ నియామకాలూ చేపట్టనున్నారు. పట్టా అందుకుంటే ఐటీ కంపెనీలు, వారికి ఎర్రతివాచీ పరిచే అవకాశం ఉంది.

"గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనేక నూతనమైన ప్రోగ్రాంలను, విద్యార్థుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ కళాశాల రాష్ట్రంలోనే రెండు సార్లు ఏ గ్రేడ్​ను, ఒకసారి ఏ ప్లస్​ గ్రేడ్​ను సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కాలేజీపై దృష్టి కేంద్రీకరిస్తే, సిద్దిపేట మాత్రమే కాకుండా చుట్టుపక్కల విద్యార్థులు సైతం విద్యాఫలాలు అంది, ప్రముఖ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు దోహదపడుతుంది."-సి.హెచ్‌ ప్రసాద్‌, ప్రిన్సిపల్‌ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల

PG Adjunct New Courses Tailored to Employment : డిగ్రీలో లైఫ్‌సైన్సెస్‌ పూర్తి చేసిన విద్యార్థుల కోసం మైక్రో బయోలజీ కోర్సు తెచ్చారు. స్థానిక కళాశాలలో ఏటా 300 మందికిపైగా లైఫ్‌ సైన్సెస్‌లో డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు. రెండేళ్ల కాలవ్యవధితో కొనసాగే పీజీ ప్రోగ్రామ్‌లో, నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. 16 కోర్సులు ఉండగా, ఇందులో ప్రధానంగా ఇండస్ట్రియల్‌, ఎన్విరాన్‌మెంటల్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌, ఫర్మంటేషన్‌ టెక్నాలజీ, మాలిక్యులర్‌ బయోలజీ ఉంటాయి.

మైక్రో బయోలజీ అభ్యసించిన వారికి ఫార్మా, ఆరోగ్య, వ్యవసాయ, పర్యావరణ, పరిశోధన రంగాల్లో మంచి డిమాండ్‌ ఉంటుందని, అధ్యాపకులు చెబుతున్నారు. కొత్త కోర్సుల వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఉపాధికి అనుగుణంగా కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంతో సిద్దిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాల ముందడుగు వేసింది. మార్కెట్‌లో అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందిస్తోంది.

ఉపాధికి రాచబాట - యూజీలో నూతనకోర్సు ప్రవేశపెట్టిన ఉన్నత విద్యా మండలి - tg Higher Education Council

Cyber Security Course in Degree Level in Telangana : డిగ్రీ కళాశాలల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సు

ABOUT THE AUTHOR

...view details