ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 42 minutes ago

ETV Bharat / state

తిరుమలలో నవహ్నిక బ్రహ్మోత్సవాలు - కనువిందు చేస్తున్న సప్తగిరులు - NAVAHNIKA BRAHMOTSAVAM

Saptagiri Arrangements for Srivari Navahnika Brahmotsavam : శ్రీవారి నవహ్నిక బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. పెరటాసి మాసం, సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలను దర్శించుకోనున్నారు. గరుడోత్సవం రోజున భారీగా శ్రీవారిని దర్శించుకోనున్నారన్న అంచనాతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాడవీధుల్లో గ్యాలరీల ఏర్పాటు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు సిద్ధం చేశారు.

srivari_navahnika_brahmotsavam
srivari_navahnika_brahmotsavam (ETV Bharat)

Saptagiri Arrangements for Srivari Navahnika Brahmotsavam : శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా, వారు సులువుగా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాల నేపథ్యంలో పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

శోభాయమానంగా తిరుమల : తిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్తు వెలుగులతో ధగధగలాడుతోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు పూర్తి చేశారు. కల్యాణ వేదికలో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాట్లు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా సీతా స్వయంవరం, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడుకొండలపై శ్రీనివాసుడు పవళించిన నమూనా సిద్ధం చేశారు. శ్రీవారి ఆలయం, దేవతా ప్రతిమలు మిరుమిట్లు గొలుపుతున్నాయి.

తిరుమలకు ముక్కోటి దేవతలు వస్తున్నారహో! వెంకన్న స్వామి 'గరుడ' వాహన సేవ ఎప్పుడంటే? - Tirumala Brahmotsavam 2024

  • బందోబస్తుకు 5,145 పోలీసులని వినియోగించనున్న, టీటీడీ సెక్యూరిటీ. సోషల్‌ మీడియాలో వ్యాపించే వదంతుల నియంత్రణకు సైబర్‌క్రైమ్‌ పోలీసుల ద్వారా ప్రత్యేక చర్యలు.
  • గరుడసేవ రోజు రద్దీ ఎక్కువైతే తిరుపతి నగర శివారులో ఐదు హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాట్లు చేయనున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు భక్తుల రవాణా జరుగుతుంది.
  • 2,700 అత్యాధునిక సీసీ కెమెరాలు, నిఘా నియంత్రణ కేంద్రాలతో నిరంతర పర్యవేక్షణ. ఈ సంవత్సరం నూతనంగా ‘వీడియో ఎనలైజింగ్‌ టెక్నాలజీ’ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
  • శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్యాలరీల్లో 2 లక్షలు మంది భక్తులు వాహన సేవలు వీక్షించనున్నారు. అదనంగా నాలుగు మాడవీధుల్లోని మూలల వద్ద మరో 80 వేల మందికి అవకాశం కల్పిస్తున్నారు.
  • తిరుమలలో 24 పార్కింగ్‌ ప్రాంతాలు, తిరుపతిలో మరో ఐదు ఏర్పాటు చేశారు. తిరుమలకు ఎనిమిది వేల వాహనాల వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆపై ఆర్టీసీ బస్సుల్లోనే అనుమతులు ఇవ్వనున్నారు.

శ్రీవారి మాడవీధుల్లోకి ప్రవేశించే భక్తులకు నాలుగింటిలోనూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో తొక్కిసలాటలు నివారించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో కొత్తగా తరలింపు టీమ్‌లు ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తేనున్నారు. గ్యాలరీల నుంచి బస్టాండ్‌ వరకు భక్తులను తరలించడం వీటి బాధ్యత. బందోబస్తుకు వచ్చిన పోలీసులు స్థానికుల దర్శన టికెట్లు పొందడం, బంధువులను గ్యాలరీల్లోకి అనుమతించడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వీవీఐపీలు, వీఐపీలు, ప్రెస్, ఉద్యోగులకు పాస్‌లు సిద్ధం చేశారు.

4న సీఎం పట్టువస్త్రాల సమర్పణ:శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. మాడవీధుల్లో పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.

తనిఖీ చేశాకే అనుమతి: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి గ్యాలరీలోకి భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే క్యూలైన్లలో అనుమతిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. టీటీడీ విజిలెన్స్, పోలీసుశాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గరుడసేవ రోజున వాహనాలను పైకి అనుమతించబోమని, క్యూఆర్‌కోడ్‌ సాయంతో కిందనే పార్కింగ్‌ చేసుకోవాలని, సురక్షిత ప్రయాణానికి భక్తులు ప్రజారవాణాను ఉపయోగించాలని కోరారు.

ఘనంగా ప్రారంభమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు - Kanipaka Vinayaka Brahmotsavams

Last Updated : 42 minutes ago

ABOUT THE AUTHOR

...view details