ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తనలా ఎవరూ ఇబ్బంది పడొద్దని' - యోగా ట్రైనర్‌గా మారిన పూజిత - PUJITHA OF VIJAYAWADA YOGA TRAINER

యోగాతో ఆరోగ్యం కాపాడుకున్న యువత - ట్రైనర్‌గా శిక్షణ ఇస్తూ పలువురికి అవగాహన కల్పిస్తున్న పూజిత

pujitha_of_vijayawada_yoga_trainer
pujitha_of_vijayawada_yoga_trainer (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 3:27 PM IST

Pujitha of Vijayawada Yoga Trainer Defies Her Severe Illness to Bag Asia Yoga Championship :అస్తమా నుంచి బయటడేందుకు యోగా ప్రారంభించిందా యువతి. క్రమం తప్పకుండా ఆసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని దారిలోకి తెచ్చుకుంది. కానీ అక్కడితో ఆగిపోలేదు. తనలా ఎవ్వరు ఇబ్బంది పడొద్దని యోగా ట్రైనర్‌గా మారింది. ఏకంగా ఏషియన్‌ యోగా ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగాలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆ యోగా ట్రైనర్‌ స్టోరీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

అలవోకగా ఆసనాలు వేయగలదు పూజిత. ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా చేయడం అలవాటు చేసుకుంది. క్రమంగా యోగా ఈమె దినచర్యలో భాగమైంది. తక్కువ వ్యవధిలోనే అనేక రకాల ఆసనాలు వేయడం నేర్చుకుని శిక్షకురాలిగా మారింది. అంతే కాదు, సింగపూర్‌లో జరిగిన ఏషియన్‌ యోగా ఛాంపియన్‌ షిప్‌లో పోటీల్లో 4వ స్థానంలో నిలిచింది.

కిలారు పూజిత స్వస్థలం విజయవాడ. చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. 9వ తరగతి చదువుతున్నప్పుడే ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, త్రోబాల్, అథ్లెటిక్స్‌ వంటి క్రీడల్లో పతకాలు సాధించింది. అంతలో అస్తమా బారిన పడింది పూజిత. అప్పటివరకు ఆటలంటేనే ఎంతో చురుకుగా ఉండే తను తరచూ అనారోగ్యానికి గురయ్యేది. క్రీడలకు పూర్తిగా దూరమైంది.

'అస్తమా కారణంగా గాలి తీసుకోవడమే ఇబ్బందిగా మారింది. దీంతో 3 సార్లు ఆపరేషన్‌ చేయించుకున్నాను. అదే సమయంలో యోగా ద్వారా ఆస్తమా తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారు. అప్పటినుంచి ఆసనాలు, ప్రాణాయామం అలవాటు చేసుకున్నాను. క్రమం తప్పకుండా చేయడం వల్ల అస్తమా ప్రభావం తగ్గింది.'-పూజిత, యోగా శిక్షకురాలు

యోగాలో పీజీ కోర్సు పూర్తి చేసిందీ యువతి. యోగా చేయడం వల్ల పీసీఓడీ సమస్యలు తగ్గించటడం, అనే అంశంపై Ph.d చేసి డాక్టరేట్ పట్టా పొందింది. నేర్చుకున్న విద్య ఉరికే పోకూడదు అనే ఉద్దేశంతో యోగా ట్రైనర్‌గా మారింది. ప్రస్తుతం కేఎల్​ యూనివర్శిటీలో యోగా శిక్షకురాలిగా పని చేస్తోంది పూజిత. ఓ వైపు యూనివర్శిటీలో యోగా శిక్షకురాలిగా పని చేస్తూనే ఉదయం, సాయంత్రం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది పూజిత. ‌అస్తమా, మధుమేహం, పక్షవాతంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. యోగాతో జబ్బులు నయం అయ్యే అవకాశం ఉందని అందుకు తనే ఒక ఉదాహరణ అని చెబుతోందీ యోగ ట్రైనర్‌.

3617 సెకన్లపాటు మేఘన కూర్మాసనం- ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

యోగా నేర్పిస్తూనే పోటీలకూ వెళ్తోంది పూజిత. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. పలుమార్లు అంతర్జాతీయ పోటీలకు వెళ్లే అవకాశం వచ్చినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేక పోయింది. కేఎల్​ యూనివర్శిటీ ఛైర్మన్‌ అర్థిక సాయం అందించడంతో సింగపూర్‌లో జరిగిన ఏషియన్‌ యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచినట్లు చెబుతోంది. ఏషియన్‌ యోగా ఛాంపియన్‌ పోటీల్లో నాలుగో స్థానంలో నిలవడం పట్ల పూజిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యోగాతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిరూపించింది పూజిత. భవిష్యత్తు లో ఏషియన్‌ యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణపతకం సాధించడమే లక్ష్యమంటోంది.

పాములా మెలికలు - యోగాపై పట్టు వదలని షాలేమ్ రాజ్ - పతకాలు పరిగెత్తుకు రావాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details