Pregnant Woman Write Group-2 Exam : నాగర్కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష జరుగుతున్న కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎలాగైన ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఓ నిండు గర్భిణీ గ్రూప్-2 పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే గర్భిణీ నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు.
డెలివరీ డేట్ ట్విస్ట్ : ఆదివారం (డిసెంబరు 15న) గ్రూప్-2 మొదటి పేపర్ పూర్తి కాగా సోమవారం (డిసెంబరు 16) ఈరోజు గ్రూప్-2 ఉదయం పేపర్-3 పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు మెల్లగా పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ అధికారులు రేవతిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. పరీక్ష రాస్తానని గట్టిగా చెప్పారు. రేవతి డెలివరీ తేదీ ఇవాళే కావడంతో పరీక్ష కేంద్రంలో సిబ్బందితో సహా అందరూ కాస్త ఆందోళనకు గురయ్యారు.
వదలని సంకల్పం : మధ్యాహ్నం కూడా పరీక్ష రాస్తే గ్రూప్-2 మొత్తం నాలుగు పేపర్లు పూర్తవుతాయి. నాలుగో పేపర్ కూడా రాస్తానని పట్టుబట్టింది. అధికారులు ఎంత చెప్పినా వినలేగదు. ఆమె పట్టు వదలకుండా పరీక్ష రాస్తానని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.