తెలంగాణ

telangana

ETV Bharat / state

'లైసెన్సులు ఎవరికొస్తే మాకేంటి? - మా ఇలాకాలో మేమే వ్యాపారం చేస్తాం' : ఎమ్మెల్యేల బెదిరింపులు

ఆంధ్రప్రదేశ్​లో మద్యం దుకాణదారులకు ఎమ్మెల్యేల నుంచి బెదిరింపులు - లైసెన్సులు తమకిచ్చి పొమ్మని ఆదేశాలు - 30 శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ హెచ్చరికలు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Politicians threatening liquor sellers in AP
Politicians threatening liquor sellers in AP (ETV Bharat)

Politicians threatening liquor sellers in AP : 'మద్యం దుకాణాల లైసెన్సుల లాటరీలు ఎవరికొస్తే మాకేంటి? మా ఇలాకాలో మేమే వ్యాపారం చేస్తాం. మీకు కావాలంటే కొంత సొమ్ము ఇస్తాం. మర్యాదగా వదిలేసి వెళ్లిపోండి' అంటూ కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. తమ పరిధిలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలంటే తమకు 20-30 శాతం వాటా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, లేదంటే ఇక్కడ వ్యాపారం ఎలా చేస్తారో తామూ చూస్తామంటూ మరికొందరు హుకూం జారీ చేస్తున్నారు. 'మీరేం చేసుకుంటారో మాకు అవసరం లేదు. కానీ ప్రతి నెలా మాకు కప్పం కట్టాల్సిందే' అంటూ కొందరు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఇదే పరిస్థితి. ఈ నాయకుల బెదిరింపులకు కొంతమంది దుకాణాలు తెరవడానికి జంకుతున్నారు.

అక్కడ దుకాణం తెరవడానికే భయపడుతున్నారు :మండలాలు, పట్టణాలు, నగరాలు యూనిట్లుగా విభజించి ఈసారి మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ శాఖ నోటిఫై చేసింది. ఉదాహరణకు విజయవాడలో 39 దుకాణాల్ని నోటిఫై చేశారు. లాటరీలో లైసెన్సు దక్కించుకున్న వారు నగర పరిధిలో ఎక్కడైనా దుకాణాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో వాటాలు, కమీషన్ల కోసం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్న నియోజకవర్గాల పరిధిలో దుకాణాలు పెట్టటానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయటానికి ఎవరూ ముందడుగు వేయడం లేదు. లైసెన్సులు దక్కించుకున్న దుకాణదారులు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోనే ప్రారంభిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దుకాణాలు ఏర్పాటు చేయాలంటే తమకు 30 శాతం వాటా ఇవ్వాలని స్థానిక ముఖ్య నాయకుడి అనుచరులు దుకాణాదారులను బెదిరిస్తున్నారు. దీంతో వారు ఇతర ప్రాంతాల్లో దుకాణాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

'ముందు మా ఫార్మాలిటీస్ పూర్తి చేయండి' - లిక్కర్ వ్యాపారులకు తలనొప్పులు

ఎవరైతే మాకేంటి :అనంతపురం పట్టణంలో కొంతమంది టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మద్యం దుకాణాల లైసెన్సులు లాటరీలో వచ్చాయి. అయితే అక్కడి స్థానిక ముఖ్యనేత వారిని వదలట్లేదు. 20-30శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలతు సంబంధం లేని మరికొందరు వ్యాపారులకు లైసెన్సులు రాగా వాటిని తమకు అప్పగించేసి వెళ్లిపోవాలంటూ ఓ ముఖ్యనేత అనుచరుడు బెదిరిస్తున్నారు. అందుకు వ్యాపారి ఒప్పుకోకపోవడంతో విద్యుత్తునగర్‌ సర్కిల్‌లో షాపు తెరవనివ్వకుండా అడ్డుకున్నారు.

  • రాజమహేంద్రవరంలో వేరే నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి లాటరీలో మద్యం దుకాణం దక్కింది. అయితే తన నియోజకవర్గం పరిధిలో దుకాణం ప్రారంభించాలంటే వారికి వాటా ఇవ్వాల్సిందేనంటూ అక్కడి ముఖ్య నేత ఒఖరు బెదిరిస్తున్నారు. అమలాపురం పరిధిలో ఓ ముఖ్య నాయకుడు తనకు 20శాతం వాటా కావాలని అడుగుతున్నారు.
  • తాడిపత్రిలో ముఖ్య నాయకుడు తన బినామీలు, అనుచరులతో అన్ని దుకాణాలకు అతి తక్కువగా మూడేసి దరఖాస్తులే దాఖలు చేయించారు. అత్యధిక శాతం దుకాణాలు ముఖ్య నాయకుడి అనుచరులకే వచ్చాయి. రెండు మాత్రం వేరేవారికి లభించగా వారిని లైసెన్సు ఫీజు కట్టనీయకుండా అడ్డుకుని ఆ దుకాణాలను సైతం చేజిక్కించుకున్నారు.

పోలీస్‌ స్టేషన్‌ పిలిపించి ఒత్తిడి తీసుకువచ్చి :నరసరావుపేటలో మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్న వారిని ముఖ్య నాయకుడి ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పోలీసుస్టేషన్‌కు పిలిపించి ముఖ్య నాయకుడికి 25 శాతం వాటా ఇవ్వాలంటూ వ్యాపారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

  • సత్తెనపల్లి నియోజకవర్గంలో మద్యం దుకాణాలు పెట్టుకోవాలంటే ముఖ్య నాయకుడికి 30 శాతం వాటా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఓ గుత్తేదారు దీనికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేట, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో స్థానిక లీడర్ల బెదిరింపులే జరుగుతున్నాయి.
  • తుని నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారుల్ని స్థానిక నాయకులు బెదిరిస్తున్నారు. లైసెన్సుల్ని తమకు అప్పగించి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కొంత వాటా ఇస్తామని వ్యాపారులు ఒప్పుకున్నా లేదు దుకాణాల్ని తమకు అప్పగించాల్సిందేనంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు.

దుకాణం అద్దెకు దొరక్కుండా :వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరులోని తాడిపత్రి రోడ్డులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యాపారి రూ.లక్ష అడ్వాన్సు ఇవ్వగా స్థానిక ముఖ్య నాయకుడి అనుచరులు సంబంధిత భవన యజమానిని హెచ్చరించారు దీంతో అక్కడ దుకాణం ఏర్పాటు కాలేదు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మద్యం దుకాణాన్ని దక్కించుకున్న ఓ లైసెన్సీని బెదిరించి ఆ దుకాణాన్ని వదిలేయాలని బెదిరించారు. రాయచోటి నియోజకవర్గంలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సజల పేరిట రెండు మద్యం దుకాణాలు రాగా స్థానిక నేత, అనుచరులు అక్కడ వారికి అద్దెకు భవనం దొరక్కుండా చేయడం దుకాణం ఏర్పాటు కష్టతరంగా మారింది.

  • నంద్యాల జిల్లా పాణ్యంలో మద్యం దుకాణాల లాటరీ దక్కించుకున్న వారు 30 శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యనాయకుడు ఒత్తిడి చేస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మరో నియోజకవర్గంలో అయితే ఓ నాయకుడు ఏకంగా 70 శాతం వాటా అడగడంతో లైసెన్సుదారు ఆందోళన వ్యక్తం చేశారు.

బెదిరించి, సొమ్ము చెల్లించి చేజిక్కించుకుని : తెలంగాణ సరిహద్దు జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని దుకాణాలకు తెలంగాణ వ్యాపారులకు దుకాణాలు దక్కాయి. స్థానిక సిండికేట్‌ ప్రతినిధులు, ముఖ్య నాయకులు వారిని బెదిరించి కొంత గుడ్‌విల్‌ చెల్లించి ఆ దుకాణాల్ని చేజిక్కించుకున్నారు.

  • విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో మద్యం దుకాణం లభించగా అక్కడి ముఖ్య నాయకుడి అనుచరులు 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో దుకాణం ఏర్పాటు చేసుకోనివ్వకుండా స్థానిక ముఖ్యనేత అనుచరులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
  • శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఒడిశాకు చెందిన కొందరు వ్యాపారులకు లైసెన్సులు లభించాయి. వాటిలో తనకు వాటా ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యనాయకుడు బెదిరించారు. నరసన్నపేట నియోజకవర్గంలోనూ ముఖ్య నాయకుడి బంధువు ఒకరు.. వాటాల కోసం లైసెన్సుదారుపై ఒత్తిడి చేస్తున్నారు.
  • దెందులూరు నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాలు ప్రవాసాంధ్రులకు దక్కాయి. అక్కడి నాయకుడి వారిద్దర్నీ భయపెట్టి, కొంత గుడ్‌విల్‌ ఇచ్చేసి ఆ దుకాణాల్ని తీసుకున్నారు.
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముఖ్యనాయకుడికి హెచ్చరికలకు భయపడి ఐదు దుకాణాలను వదులుకునేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. తిరుపతిలోనూ లైసెన్సులను దక్కించుకున్న వారిని స్థానిక నాయకుడి అనుచరులు వాటాల కోసం డిమాండ్ చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో నాయకుడికి 40 శాతం వాటా చెల్లించేందుకు లైసెన్సుదారు అంగీకరించి దుకాణాన్ని ప్రారంభించారు. రామచంద్రాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి మద్యం దుకాణం లాటరీ వచ్చింది. దాన్ని తమకు అప్పగించాలంటూ నియోజకవర్గ నేత ఒత్తిడి తేవటంతో ఆయన ఎదురు తిరిగారు.

మందు కిక్కు- ఒకటే దెబ్బకు రూ.142.79 కోట్ల మద్యం విక్రయాలు

ఐడియా అదిరిందయ్యా - షాపులు దొరక్క వ్యాపారి సూపర్‌ ప్లాన్‌ - మందుబాబులు ఫుల్​ ఖుష్

ABOUT THE AUTHOR

...view details