Police lathi Charge on Protesters at Kummariguda Muthyalamma Temple Secunderabad : తెలంగాణలోని సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు అమ్మవారి విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు చెప్పులు విసిరారు. ఆందోళన చేస్తున్న హిందూ సంఘాల శ్రేణులకు డీసీపీ రష్మీ పెరుమాల్ నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్లో ఆందోళనకారుల్లో కొందరి తలలకు గాయాలయ్యాయి. మరికొంతమందికి శరీర భాగాల్లో గాయాలయ్యాయి. లాఠీఛార్జ్లో తన ఎడమ చెయ్యి విరిగిందంటూ దుర్గా అనే యువకుడు నేలపై కూలబడ్డాడు.
సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి వద్ద మళ్లీ ఆందోళన - నిరసనకారులపై లాఠీఛార్జ్
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత - పోలీసులు, హిందూ ధార్మిక సంఘాల కార్యకర్తల మధ్య వాగ్వాదం - ఆందోళనకారులపై లాఠీఛార్జ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
అసలేం జరిగింది: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడ్డ ఆగంతకులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను నిలువరించే ప్రయత్నం చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారు.