ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అరకు కాఫీపై మోదీ మరోసారి ప్రశంసలు- మరోసారి కలిసి రుచి చూద్దామన్న చంద్రబాబు - PM Modi About Araku Coffee

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 6:11 PM IST

Modi Tweet on Araku Coffee : అరకు కాఫీ గొప్పతనం గుర్తుచేసుకుంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్న ఫొటోను ఎక్స్​లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని ట్వీట్​కు చంద్రబాబు రిప్లై ఇచ్చారు. మోదీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.

PM Modi About Araku Coffee
PM Modi About Araku Coffee (ETV Bharat)

PM Modi About Araku Coffee :ప్రజలకు సందేశం ఇవ్వడంతో పాటు వారితో మమేకం కావడానికి ప్రతి నెలా చివరి ఆదివారం ఏర్పాటు చేసే మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునఃప్రారంభించారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసంగం చేశారు. మరోసారి ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Modi Tweet on Araku Coffee : భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందనీ అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో పండే కాఫీ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో చెప్పారు. విశాఖపట్టణం వచ్చినప్పుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఆ కాఫీ తాగినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. అరకు కాఫీకి దిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్‌లోనూ ప్రశంసలు దక్కాయని చెప్పారు. ఈ కాఫీ సాగుతో గిరిజన సాధికారతకు ముడిపడి ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కాఫీ ప్రియులైతే, ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి వచ్చే కాఫీని రుచి చూడాలని మోదీ ట్వీట్ చేశారు.

CM Chandrababu Reply to Modi Tweet :ప్రధాని నరేంద్ర మోదీ పెట్టిన పోస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిప్లై ఇచ్చారు. మోదీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేడ్‌ ఇన్‌ ఆంధ్ర ఉత్పత్తిగా అరకు కాఫీని ఆమోదించిన మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు దేశం మొత్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో పండించడంతో ఇక్కడి కాఫీ పంటకు డిమాండ్‌ ఎక్కువ. సముద్ర మట్టానికి 3,600 ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండించే ఈ కాఫీ గింజలను ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేకరిస్తుంది. అందులో కొంత మొత్తాన్ని ఈ వేలం ద్వారా అమ్మకాలు చేస్తుంది. మరికొన్నింటిని అరకువ్యాలీ కాఫీ పేరుతో మార్కెంటింగ్‌ చేస్తోంది.

సాగరతీరంలో.. అరకు కాఫీ అదరహో!

అరకులో ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!

ABOUT THE AUTHOR

...view details