ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫోన్‌కాల్స్‌ విశ్లేషిస్తున్న పోలీసులు- పెద్దిరెడ్డి అనుచరులకు బిగుస్తున్న ఉచ్చు - MADANAPALLE FIRE ACCIDENT CASE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 1:06 PM IST

MADANAPALLE FIRE ACCIDENT CASE: మదనపల్లె సబ్​ కలెక్టరేట్​ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసు కొలిక్కివస్తోంది. ఈ ఘటనలో పెద్దిరెడ్డి అనుచరులపై ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 వేల ఫోన్‌కాల్స్‌ డేటాను పోలీసులు విశ్లేషస్తున్నారు. దీంతో ఫైళ్ల దహనం కేసులో అనుమానితులు, పెద్దిరెడ్డి అనుచరులు కొద్ది రోజులుగా పరారీలోనే ఉన్నారు.

MADANAPALLE FIRE ACCIDENT CASE
MADANAPALLE FIRE ACCIDENT CASE (ETV Bharat)

MADANAPALLE FIRE ACCIDENT CASE: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీస్​లో ఫైళ్ల దహనం ఘటనలో పాత్ర ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితులను ఒక్కొక్కరిని విచారిస్తున్న కొద్దీ, అక్రమాల డొంక కదులుతోంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరికొందరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కుట్ర కోణాన్ని ఛేదించేందుకు వేలాది ఫోన్‌కాల్స్‌ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.

ఈ నెల 21వ తేదీన ఆదివారం అర్ధరాత్రి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టగా, ఈ వారం రోజుల్లో పలువురు అధికారులు, అనుమానితులను పోలీసులు విచారించారు. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ నేరానికి పాల్పడింది పక్కాగా పెద్దిరెడ్డి అనుచరులేనని ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. దస్త్రాలను రెవెన్యూ సిబ్బందితో దహనం చేయించారా లేదంటే వైఎస్సార్సీపీకి చెందిన వారే ప్రత్యక్షంగా పాల్గొన్నారా అనేది తేల్చడానికి ఫోరెన్సిక్‌ నివేదిక కోసం వేచి చూస్తున్నారు.

మదనపల్లె ఘటనలో కదులుతున్న డొంక - పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు - Madanapalle Fire Accident Case

ఎక్కడి దొంగలు అక్కడే

  • దస్త్రాల కాల్చివేత కేసులో అనుమానితుడు, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి గత వారం రోజులుగా పరారీలోనే ఉన్నారు. అతని ఆచూకీని గుర్తించేందుకు వీల్లేకుండా ఫోన్‌ ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఘటనకు వారం రోజుల ముందు నుంచి మాధవరెడ్డి తరచూ సబ్‌ కలెక్టర్ ఆఫీస్​కు వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
  • మదనపల్లె పురపాలక సంస్థ వైస్‌ ఛైర్మన్‌ జింకా చలపతిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. భూ లావాదేవీలకు సంబంధించిన కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. బండపల్లి సర్పంచి ఈశ్వరమ్మ భర్త అక్కులప్పను సైతం మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి, విచారించిన తరువాత వదిలేశారు.
  • రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన బాబ్‌జాన్‌ పాత్రపై అనుమానంతో రెండు రోజుల నుంచి అతని ఇంటి వద్ద నిఘా పెట్టారు. అయితే అప్పటికే అతను పరారైనట్లు గుర్తించారు. అతని ఇంట్లోని ఫైళ్లను సీజ్‌ చేసేందుకు పోలీసులు వెళ్లగా, కుటుంబ సభ్యులు తాళం వేసి, తాళపు చెవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఎర్రచందనం స్మగ్లర్‌గా పేరున్న బాబ్‌జాన్‌ మదనపల్లె డివిజన్‌లో పెద్దిరెడ్డి పేరు చెప్పి అనేక భూదందాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
  • ఈ కేసులో మదనపల్లె పూర్వ ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్, కాపలాగా ఉన్న వీఆర్‌ఏ రమణయ్యను వారం రోజులుగా విచారిస్తున్నారు.
  • ఫైళ్లు దహనమైన సెక్షన్‌లోని సిబ్బందితో పాటు 35 మంది ఉద్యోగులను ఇప్పటికే ప్రశ్నించారు. వారి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 3 వేల ఫోన్‌ కాల్స్‌ డేటాను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఘటనకు ముందు, ఆ తర్వాత అనుమానితులు, రెవెన్యూ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య నమోదైన ఫోన్‌ కాల్స్‌ను బట్టి సూత్రధారులు, పాత్రధారులను తేల్చే పనిలో పడ్డారు. అయితే, తప్పు చేసి, దొరికిపోయామన్న భావనతో ఉన్న అనేక మంది వైఎస్సార్సీపీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

మదనపల్లె అగ్ని ప్రమాదం నిగ్గుతేల్చిన సిసోదియా!- ప్రభుత్వానికి కీలక నివేదిక - SISODIA REPORT

ABOUT THE AUTHOR

...view details