108 Shiva Lingam Carved Out of Chalk Piece Art :మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గిరిజన బాలుర గురుకుల కళాశాల ఉపాధ్యాయుడు సూక్ష్మ కళాకారుడు ఆకెపు రజినీకాంత్ సుద్దముక్కలతో 108 శివలింగాలను సుమారు 10 గంటల పాటు శ్రమించి తయారు చేశాడు. ఒక సెంటీమీటర్ ఎత్తు, వెడల్పు ఉన్న శివలింగాలను గుండు పిన్ను సహాయంతో తీర్చిదిద్దాడు.
సుమారు 10 గంటల పాటు శ్రమించి సుద్దముక్కల ఆర్ట్ ద్వారా లింగాలను తయారు చేసి, సూక్ష్మకళ ద్వారా మహాశివరాత్రి సందర్భంగా తన భక్తిని చాటుకున్నాడు. ఇంతకు ముందు సుద్దముక్కలపై వివిధ ఆకృతులను గీసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, ఆర్హెచ్ఆర్ వరల్డ్ రికార్డుతో పాటు సృజనపుత్ర, కళారత్న అవార్డులు అందుకున్నారు. సమయం దొరికితే ఇలా ఏదో ఒకటి చేస్తుంటానని చెబుతున్నారు. ఇలా సుద్దముక్కలతో శివలింగాన్ని తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
గుండు పిన్నుపై శివడు, నంది :మరోవైపు జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ వినూత్నమైన సూక్ష్మకళను తయారు చేసి ఔరా అనిపించాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరుడిని తయారు చేశాడు. అతి సూక్ష్మ సైజులో తయారు చేసిన శివయ్య నందీశ్వరుడి విగ్రహాల కోసం గుండు పిన్ను, నైలాన్, పెన్సిల్ కలర్లను వాడాడు. దీనిని తయారు చేయడానికి సుమారు 12 గంటల సమయం పట్టిందని గుర్రం దయాకర్ తెలిపారు. తాను ప్రతి సంవత్సం ఏదో విధంగా శివుని రూపాలు తయారు చేస్తానాని చెప్పారు.