ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాడు కళకళ - నేడు వెలవెల - అస్తవ్యస్తంగా తారకరామ సాగర్ నిర్వహణ - No Maintenance of Tarakarama Sagar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 2:14 PM IST

Tarakarama Sagar in Sattenapalli: మినీ ట్యాంక్ బండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్తెనపల్లిలోని తారమరామ సాగర్‌ గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిర్వహణ కరవై అస్తవ్యస్తంగా మారింది. తెలుగుదేశం పార్టీకి పేరు వస్తోందనే అక్కసుతో వైఎస్సార్సీపీ సర్కార్ నిర్వహణను గాలికొదిలేయటంపై స్థానికులు మండిపడుతున్నారు.

Tarakarama_Sagar_in_Sattenapalli
Tarakarama_Sagar_in_Sattenapalli (ETV Bharat)

No Maintenance of Tarakarama Sagar in Sattenapalli: హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌ తరహాలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తారకరామ సాగర్‌ నిర్మించారు. 2014-19 మధ్య 45 ఎకరాల సువిశాల ప్రదేశంలో తారకరామ సాగర్‌, వావిలాల పార్క్‌ను తీర్చిదిద్దిదారు. మినీ ట్యాంక్ బండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తారకరామ సాగర్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిర్వహణ కరవై అస్తవ్యస్తంగా మారింది. 45ఎకరాల విస్తీర్ణం చెరువు మధ్యలో 50 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం పక్కనే అందమైన వావిలాల పార్క్, పిల్లలు ముచ్చట పడే బోటింగ్ వీటన్నింటి కలయికతో ఆహ్లాదానికి అసలైన చిరునామాగా సత్తెనపల్లిలో తారకరామసాగర్‌ను కోడెల హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ తారకరామ సాగర్‌, వావిలాల పార్క్‌ను 2019 జనవరిలో ప్రారంభించారు. 40 ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్న సత్తెనపల్లిలో ఒక్కటంటే ఒక్క పార్కు లేకపోవడంతో తారకరామసాగర్ నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పరిసర ప్రాంత వాసులు సైతం కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా గడపడంతో తారకరామసాగర్ కళకళలాడింది.

పార్కు సంకెళ్లు వీడాయి- ఐదేళ్ల తరువాత ఆహ్లాదంగా సేదతీరుతున్న నగరవాసులు - REOPEN NELLORE Park

మినీ ట్యాంక్‌బండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతం గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో సమస్యల నిలయంగా మారింది. వాకింగ్ ట్రాక్, గార్డెన్ నిర్వహణ గాలికి వదిలేయడంతో మహిళలు, వృద్ధులు వాకింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. పిచ్చి మొక్కలు పెరగడం వల్ల పాములు, విష పురుగుల సంచారం ఎక్కువైంది. పిల్లలను పార్కుకు తీసుకురావాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతోపాటు సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకుల్ని, చిన్నారుల్ని ఆకట్టుకునేందుకు తెలుగుదేశం హయాంలో అందుబాటులోకి తెచ్చిన బోటింగ్‌కు అన్ని వర్గాల నుంచి ఆదరణ దక్కింది. టికెట్ల విక్రయం ద్వారా మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతో బోటింగ్‌ను, తారకరామసాగర్ నిర్వహణను పూర్తిగా పక్కనపెట్టేసింది. కనీస పర్యవేక్షణ కరవై సమస్యలు పెరిగిపోయాయి.

తారకరామసాగర్‌లో చేపలు పట్టుకునేందుకు కొందరూ చుట్టూ వేసిన ఫెన్సింగ్ తొలగించారు. ఫలితంగా వాకింగ్​కు వచ్చే వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలే ఈ చెరువులో ఓ బాలుడు మృతి చెందాడు. భద్రతా వైఫల్యం, సిబ్బంది లేకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తారకరామసాగర్‌ ఈ పరిస్థితికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఎర్రన్నాయుడు పార్కు - నాడు కళకళ, నేడు వెలవెల

ABOUT THE AUTHOR

...view details