ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో 90వేల విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు - మంత్రి సత్యకుమార్ - FREE EYE GLASSES TO STUDENTS

అనంతపురం జిల్లా ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపణీ - కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే శ్రావణి శ్రీ

Minister Satyakumar Yadav Distributed Free Eye Glasses to Students
Minister Satyakumar Yadav Distributed Free Eye Glasses to Students (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 8:01 PM IST

Minister Satyakumar Yadav Distributed Free Eye Glasses to Students : కేంద్రం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటిచూపుతో ఇబ్బందులు పడుతున్న 20 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 90 వేల మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరమని గుర్తించామన్నారు. వారందరికీ కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే శ్రావణి శ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

90వేల మంది విద్యార్థులకు పంపిణీ : ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థులకు కంటి చూపుకు సంబంధించిన సమస్యలపై ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఉచిత కంటి అద్దాలతో పాటు అవసరమైతే కంటికి సంబంధించిన సర్జరీలు కూడా చేస్తామన్నారు. రాష్ట్రంలో కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న 20లక్షల మంది విద్యార్థులను గుర్తించామని వారిలో 90వేల మందికి ఈరోజు కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ విద్యార్థుల పాఠశాలలకు వెళ్లి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా గాలదిన్నెలో 98 మంది విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు.

రోగాల బారిన పడకుండా చర్యలు : అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ తప్ప మిగిలన అన్ని ప్రాంతాలలో ఈ ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. చిన్నపిల్లలు భవిష్యత్తులో 44 రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్​వాడీ టీచర్ల ద్వారా ఆరు సంవత్సరాల పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఈ చికిత్సలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు : అనంతరం ఎమ్మెల్యే శ్రావణి శ్రీ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గార్లదిన్నె మండల కేంద్రంలో మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు మంత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల చిన్న వయసులోనే విద్యార్థులు కంటి చూపు కోల్పోతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.

ఏపీలో హెచ్‌ఎంపీవీ కేసులేవీ నమోదు కాలేదు - ప్రజలు భయపడొద్దు: మంత్రి సత్యకుమార్

ఆసుపత్రుల్లో భద్రతపై మంత్రులు అనిత, సత్యకుమార్ చర్చలు - Ministers Discuss Safety of Doctors

ABOUT THE AUTHOR

...view details