తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీతేజ్​కు రూ.50లక్షల చెక్కు అందించిన మైత్రీ మూవీస్ - అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన కోమటిరెడ్డి - KOMATIREDDY VISITS SRITEJ

కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించిన మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - అల్లు అర్జున్​ ఇంటిపై దాడిని ఖండించిన మంత్రి

KOMATIREDDY VISITS SRITEJ
KOMATIREDDY VISITS SRITEJ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 4:41 PM IST

Updated : Dec 23, 2024, 6:58 PM IST

Minister Komatireddy On Attack On Allu Arjun House :సంధ్య థియేటర్లో జరిగిన ఘటన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలను చేసి రాద్ధాంతం చేయడం మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. సికింద్రాబాద్​ కిమ్స్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ను పుష్ప సినీ నిర్మాత నవీన్​తో కలసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మైత్రి మూవీ క్రియేషన్స్ తరఫున నిర్మాత నవీన్, శ్రీతేజ్​ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్​ ఇంటిపై దాడి ఘటనపై ఆయన స్పందించారు.

అల్లు అర్జున్​ ఇంటిపై దాడి ఘటనను ఖండిస్తున్నా :అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సినీ హీరోల, నిర్మాతల ఇళ్లపై దాడి చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. అలా చేస్తే చర్యలు తప్పవని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఇలాంటి ఘటనల విషయంలో పోలీసు శాఖ చూసుకుంటుందని అన్నారు.

తెలంగాణలో సినీ పరిశ్రమను అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకెళ్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై ప్రతినిత్యం ఆరా తీస్తున్నారన్నారు. శ్రీతేజ్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లుగా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.

"సంధ్య థియేటర్​లో జరిగిన ఘటనను ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. ఈ విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలి. అల్లు అర్జున్​ ఇంటిపై దాడి చేయడం, దూషించడం సరికాదు. ఇళ్లపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవు. సినీ పరిశ్రమను అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకెళ్తాము. బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేటీఆర్​లు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేము. బాలుడు శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది"- కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, మంత్రి

అల్లు అర్జున్‌ వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలి : మంత్రి కోమటిరెడ్డి

ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు - టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఉండదు! : మంత్రి కోమటిరెడ్డి

Last Updated : Dec 23, 2024, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details