KTR Comments on CM Delhi Tours : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్కు దమ్ముంటే “చలో దిల్లీ” కాదని, “చలో పల్లె” బాట చేపట్టాలని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే, వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు దిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా? అని నిలదీశారు.
పర్యటనలతో ప్రయోజనం శూన్యం : రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా? అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారని, గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారని ఆరోపించారు. సీఎం దిల్లీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. అన్నదాతలను ఆగంచేసి, దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రైతుల తండ్లాట తీర్చేది ఎవరు, రుణమాఫీ పూర్తిచేసేది ఎవరని అడిగారు.
రైతుల సమస్యలపై తీరిక లేదా :పార్టీ అధిష్ఠానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప, అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని కేటీఆర్ ఆక్షేపించారు. రైతులకేమో మాయ మాటలు, దిల్లీ పెద్దలకు మాత్రం మూటలా అని తీవ్రంగా స్పందించారు. 20 సార్లు చేపట్టిన దిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది “గుండు సున్నా” అని ఎద్దేవా చేశారు. ఓ వైపు డెంగీ మరణాలు, మరోవైపు పెరుగుతున్న నేరాలు, ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు అని పేర్కొన్నారు.