తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / state

'హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ముందే ప్రజలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఉండాల్సింది' - MLA Danam About Hydra

Danam Nagender on Hydra : హైడ్రా కూల్చివేతలు చేపట్టే ముందు అక్కడున్న వారికి ముందుగా కౌన్సిలింగ్​ ఇచ్చి ఉంటే బాగుండేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్​ అన్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్‌ మార్కుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. త్వరలో పది మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారన్న ఆయన, హరీశ్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

MLA Danam Nagender About Hydra Demolishes
Danam Nagender on Hydra (ETV Bharat)

MLA Danam Nagender About Hydra Demolishes :చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసే ముందు అక్కడున్న వారికి కౌన్సిలింగ్​ ఇచ్చి ఉంటే బాగుండేదని ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో మూసీ నిర్వాసితులను తరలించేటప్పుడు కూడా అధికారులు ప్రజలకు నచ్చజెప్పి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్‌ మార్కులు తదితర అంశాలకు సంబంధించిన విషయాలను సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో దానం నాగేందర్​ మీడియాతో మాట్లాడారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్​ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్‌భవన్‌ ప్రాంతంలోని పార్క్‌ హోటల్‌కు శిఖం భూమిలో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దాని పక్కనే మాజీమంత్రి కేటీఆర్​ స్నేహితుడు, ఆయన బినామి ప్రదీప్‌రెడ్డికి చెందిన ప్రదీప్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో శిఖం భూమిలో పది అంతస్తులకు అనుమతి ఎలా దక్కిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. కేటీఆర్​ ఉంటున్న ఫాంహౌస్​ కూడా ఆయన బినామి ప్రదీప్‌రెడ్డిదేనన్నారు. ఐమ్యాక్స్‌ థియేటర్‌ కూడా చెరువులోనే ఉందని తెలిపారు.

'బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్‌ మార్కులు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తా. అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసే ముందు అక్కడున్న వారికి ముందుగా కౌన్సిలింగ్‌ ఇచ్చి ఉంటే బాగుండేది' - దానం నాగేందర్​, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ నేతలు ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు : శిఖం ల్యాండ్‌లో శోభ కన్‌స్ట్రక్షన్‌కు కూడా పదిహేను అంతస్తులకు పర్మిషన్​ ఎలా ఇచ్చారని దానం నాగేందర్ నిలదీశారు. బీఆర్​ఎస్​ నేతలు హరీశ్​రావు, కేటీఆర్​, సబితాఇంద్రారెడ్డిలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పదోవ పట్టించడం సరికాదని హితవు పలికారు. మూసీనది పరివాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

హైడ్రా నందగిరిహిల్స్​లోని గుడిసెలను కూల్చివేయడానికి వచ్చిన సమయంలో తాను కూడా వ్యతిరేకించి, గుడిసెల జోలికి వెళ్లవద్దని సూచించిన విషయాన్ని దానం గుర్తిచేశారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసని తెలిపారు. హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోమని హరీశ్​రావు అనడం సరికాదన్నారు. హరీశ్​రావు అవగాహన ఉన్న వ్యక్తి అని, ఆయన చీఫ్‌ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారో అని మండిపడ్డారు.

'సిటీకి ఎంతో మంది ఐపీఎస్​లు వస్తుంటారు పోతుంటారు - దానం నాగేందర్ లోకల్' - MLA Danam Nagender On GHMC Case

ABOUT THE AUTHOR

...view details