Rain Water Harvesting Tips :ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇటీవల వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. అయితే వానాకాలం రాకముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే మాసం మధ్యలో ఎండలు దంచికొట్టాల్సి ఉండగా అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. ఉక్కపోత మాయమై ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వానలు కురుస్తున్నాయి సరే.
వర్షాలు కురిసిన ప్రతిసారి ఉత్పన్నం అయినట్లే ఈ సారి కూడా వాన నీటి సంరక్షణ ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఓ వైపు ప్రజలు నీటి కోసం అల్లాడుతూ ఉంటే మరో వైపు వాన నీరు వృథాగా పోతోంది. చెరువులు, కాలువలు, కుంటలు, భూగర్భంలోకి చేరాల్సిన వాన నీరు మురికి కాలువల్లోకి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో వాన నీటి సంరక్షణకు అంతా ఇప్పుడే కదలాలి అన్న బాధ్యతను ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి. చుక్క చుక్కను ఒడిసి పట్టాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి.
బెంగళూరు పరిస్థితులు రాకుండా ఉండాలంటే :ఇటీవల బెంగళూరు ప్రజలు నీటి కొరతతో అల్లాడిన పరిస్థితులను దేశమంతా గమనించింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా నీటి కోసం అల్లాడిపోయారు. ఒక్క హైదరాబాద్ అనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాలు నీటి కొరతతో సతమతం అవుతున్నాయి. ఇది ఇప్పటిది కాదు, సుదీర్ఘకాలంగా నీటి ఎద్దడి దేశంలో పెద్ద సమస్యగా మారింది. కిలోమీటర్లు ప్రయాణించి బిందెడు నీరు మోసుకువెళ్లే దృశ్యాలు దేశంలో కోకొల్లలు.
ఇలాంటి పరిస్థితికి కేవలం నీటి వనరులు పరిమితంగా ఉండడమే కాదు, భూగర్భ జలాలను విపరీతంగా తోడడం, వర్షం కురిసిన సమయంలో దాన్ని ఒడిసిపట్టి నిల్వ చేయకపోవడం కూడా కారణమే. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చెరువులు, కుంటలను పూడ్చి వేసి నిర్మాణాలు చేపట్టడం మరో కారణం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు వాననీటి సంరక్షణే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. మరో పక్షం రోజుల్లో వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సిద్ధమై వర్షపు నీటిని సంరక్షించడం తక్షణావసరం.
భూగర్భ జలాలో ప్రధాన ఆధారం :భారత్లో భూగర్భ జలాల్లో 80శాతం వ్యవసాయానికి, 12శాతం పరిశ్రమలకు, 8శాతం తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. భూగర్భ జలవనరుల అంచనా నివేదిక-2020 ప్రకారం దేశీయంగా పంజాబ్, హరియాణా, దిల్లీ, రాజస్థాన్లో భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు మరింత క్షీణించే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ గతంలోనే హెచ్చరించింది.
Depleting ground water :దేశవ్యాప్తంగా సుమారు 256 జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గ్రామీణ భారతంలో 85శాతం ప్రజలు తాగునీటికి, రోజువారీ అవసరాల కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. అందుకే భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ నిర్వహణ, అవి కలుషితం కాకుండా చూడడం చాలా అవసరం. భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల మరమ్మతు, పునరుద్ధరణ తదితర చర్యల కోసం జలగణన చేపట్టాలని గతంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది.
Report on Water resources :పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 24లక్షలకు పైగా కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, సరస్సుల వంటి జలవనరులు ఉన్నాయి. అందులో 38వేలకు పైగా ఆక్రమణకు గురయ్యాయి. దాదాపు నాలుగు లక్షల జల వనరులు నిరుపయోగంగా మారాయి. 97.1శాతం జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 2.9శాతమే నగరాలు, పట్టణాల్లో నెలకొన్నాయి. దేశీయంగా నీటి సంరక్షణ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్లు 12.7శాతమే.
అధికశాతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో :మొత్తం నీటి వనరుల్లో 55శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోవాల్సిన జల వనరులు 45శాతం. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 18శాతం. కాని నీటి వనరుల పరంగా ఉన్న వాటా మాత్రం 4శాతమే. విచ్చలవిడి వాడకంతో పాటు సంరక్షణ చర్యలు లేకపోవడంతో భారత్లో నీటి కొరత ఏర్పడుతోంది. చెరువులు, కుంటలు వంటి జల వనరులను విచ్చలవిడిగా పూడ్చి వేయడంతో నీటి కొరత ఏర్పడడమే కాదు వర్షాలు కురిసినపుడు అవి నిల్వ అయ్యే ప్రదేశాలు లేక వరదలు నివాస ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.