Hyper Aadi Reaction on Janasena Contesting 24 Seats : జనసేనకు తక్కువ సీట్లు కేటాయించారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసైనికులకు, నటుడు హైపర్ ఆది ఓ వీడియో సందేశం ఇచ్చారు. జనసేనకు 24 సీట్లు అని ప్రకటించినప్పటి నుంచి పవన్ కల్యాణ్ని(Pavan Kalyan) విమర్శిస్తున్నారని, అదే విధంగా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని, మరికొంత మంది జనసేన జెండాని కిందపడేసి తొక్కుతున్నారని ఆది ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక, ఎంతో బాధతో జనసైనికులకు, వీరమహిళలకు వీడియో ద్వారా సందేశాన్ని పంపిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందేశాన్ని జనసేన నేత నాగబాబు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
ఒక్కసారి ఆలోచించండి: జనసైనికులు ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించాలని హైపర్ ఆది కోరారు. తనను నమ్ముకున్న ప్రజలను, తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది కాదని పేర్కొన్నారు. పెట్టిన పార్టీకి సపోర్టు చేస్తున్న ప్రజలే ఇంతగా ఆలోచిస్తుంటే, అదే పార్టీని పెట్టిన పవన్ కల్యాణ్ ఎంతగా ఆలోచించారో కదా అని ప్రశ్నించారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి తనలో తాను ఎంతగా మదన పడ్డారో ఒక్కసారి ఆలోచించాలని హైపర్ ఆది కోరారు.
ఆ హక్కు మనకు నిజంగా ఉందా: పది సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా, తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆది కొనియాడారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్లు జనసైనికులు కూడా మాట్లాడటం చూసినప్పుడు చాలా బాధగా అనిపించిందని అన్నారు. 2019 ఎన్నికలలో కనీసం పవన్ కల్యాణ్ని కూడా గెలిపించుకోలేదని, ఇప్పుడు 24 సీట్లపై ప్రశ్నించే హక్కు జనసైనికులుగా మనకు ఉందా అని ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్
రెండు చోట్లా ఓడిపోయినా సరే: మామూలుగా ఎవరైనా సరే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే చాలా రోజులు ఇంటి నుంచి బయటకిరారని, అలాంటిది పవన్ కల్యాణ్ మాత్రం రెండు చోట్లా ఓడిపోయినా సరే సమస్య అనేసరికి రెండో రోజే బయటకు వచ్చి దానిని పరిష్కరించారని తెలిపారు. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బులు సైతం తీసి కౌలు రైతుల సమస్యలను తీర్చిన పవన్ కల్యాణ్ గురించి ఈ రోజు విమర్శలు చేస్తున్నారని ఆది ఆవేదన చెందారు. ఈ విధంగా పవన్ కల్యాణ్ ఎన్నో సమస్యలను పరిష్కరించారని అన్నారు.