ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్సీపీ హయాంలో మీ-సేవ కేంద్రాలకు కష్టాలు - కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న నిర్వాహకులు - Mee Seva Centers Problems in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 8:26 AM IST

Mee Seva Centers Problems in AP : రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పౌరసేవలు తగ్గిపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్‌ సొమ్ములు సకాలంలో రాక సగానికి పైగా ఇప్పటికే మూతపడ్డాయి. వైఎస్సార్సీపీ సర్కార్ వాటి సేవలను గ్రామసచివాలయాలకు బదిలీ చేయడంతో ప్రజలెవ్వరూ ఈ కేంద్రాలకు రాక నిర్వహణ భారంతో మూసివేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా మళ్లీ పాత విధానం పునరుద్ధరించాలని మీ-సేవ నిర్వాహకులు కోరుతున్నారు.

Mee Seva Centers Problems in AP
Mee Seva Centers Problems in AP (ETV Bharat)

Mee Seva Centers Issues in Joint Anantapur District :గత ప్రభుత్వ హయాంలోని జగన్ నిరంకుశ నిర్ణయాలకు మీ-సేవ నిర్వాహకులు బలయ్యారు. రాబడి లేక, నిర్వహణ ఖర్చులు భరించలేక రాష్ట్రవ్యాప్తంగా చాలా మీ-సేవ కేంద్రాలను ఎత్తివేశారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన ఈ-సేవ కేంద్రాలన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులవేనని భావించి వాటిపై జగన్ కక్షగట్టారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పౌరసేవలన్నీ దూరం చేశారు.

Mee Seva Centers in Andhra Pradesh :ఐటీశాఖ పరిధిలో ఉన్న మీ-సేవ కేంద్రాలను పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామసచివాలయ వ్యవస్థకు మీ-సేవ కేంద్రాల ప్రధాన సేవలన్నింటినీ బదిలీ చేశారు. దీంతో రాబడి కోల్పోయి, వీటిని నిర్వహించలేక అనేకచోట్ల మూతపడుతున్నాయి. సచివాలయాల్లో అయినా అన్ని సేవలు అందిస్తున్నారా అంటే అదీ లేదు. మౌలికసదుపాయాలు కల్పించకపోవడంతో గ్రామసచివాలయాల్లో పౌరసేవలు అందక ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారు.

నిర్వహణ భారంతో చాలాచోట్ల మూసివేత : మీ-సేవ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించి తమ హక్కులను కొంతమేర కాపాడుకున్నా, ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిపై మరింత కక్షగట్టడంతో ప్రజలకు పౌరసేవలు దూరమయ్యాయి. ఫలితంగా ఒక్కప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 11,500 ఉన్న మీ-సేవ కేంద్రాలు ఇప్పుడు సగానికి పడిపోయి 5,500కు చేరుకున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో 670 కేంద్రాలు ఉండగా, ఇప్పుడు కేవలం 380 సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి.

"జగన్ సీఎం అయ్యాక మాకు సమస్యలు ప్రారంభమయ్యాయి. సచివాలయాలు ప్రారంభించారు. మాకు కొన్ని సర్వీసులు తొలగించారు. ఆ తర్వాత మేము పోరాడితే ఏపీ పోర్టల్ ద్వారా మాకు కొన్ని సేవలు కల్పించారు. మళ్లీ మీ-సేవ కేంద్రాలకు అన్ని సేవలు అందించేలా అవకాశం కల్పించాలని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం." - సత్యనారాయణరెడ్డి, మీ-సేవ కేంద్రం నిర్వాహకుడు

ఈ-సేవ కేంద్రాలను మీ-సేవగా మార్పు : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడమే ధ్యేయంగా చంద్రబాబు హయాంలో ఈ-సేవ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్ కొనసాగించింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా, ఈ-సేవ కేంద్రాలను మీ-సేవ కేంద్రాలుగా మార్చి ఏపీ ఆన్​లైన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వ సంస్థ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, మౌలిక సదుపాయాలు కల్పించేవారు.

YSRCP Govt Neglect on Mee Seva Centers :2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తర్వాత మీ-సేవ కేంద్రాలను మరింత బలోపేతం చేశారు. అన్ని సేవలను ఐటీ విభాగం కిందకు తీసుకొచ్చారు. జగన్‌ వచ్చిన తర్వాత వాటన్నింటికీ పాతరేశారు. కొన్ని నెలలుగా వారికి ఇవ్వాల్సిన కమీషన్‌ సైతం నిలుపుదల చేశారు. ప్రభుత్వ లోగోతో ఉండే ఖాళీ ధృవపత్రాలను చంద్రబాబు హయాంలో ఒక్కొక్కటీ రూపాయిన్నరకు ఇస్తే, జగన్ వాటి ధర 3 రూపాయల70 పైసలకు పెంచారు.

కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలి :మీ-సేవ కేంద్రాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేవి. గ్రామసచివాలయాలు సాయంత్రం 5 గంటల వరకే సేవలు అందుతున్నాయి. ఆదివారాలు, పండుగ రోజుల్లో సెలవు ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని మీ-సేవ నిర్వాహకులు తెలిపారు. మళ్లీ మీ-సేవ కేంద్రాలకు అన్ని సేవలు అందించేలా అవకాశం కల్పించాలని, కూటమి ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

Meeseva Services On Mobile : "మీ సేవ" సెంటర్​తో పని పడిందా..? మీ ఫోన్​లోనే చేసుకోండిలా!

మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ

ABOUT THE AUTHOR

...view details