Home Minister Anitha Inspects Central Jail: విశాఖ సెంట్రల్ జైలులో సెల్ఫోన్లు దొరకడంపై విచారణ జరుగుతోందని హోంశాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు. కారాగారంలో పరిసరాలను అధికారులతో కలిసి హోంమంత్రి పరిశీలించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు.
జైలులో గంజాయి మొక్క: ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట సైతం పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్లో ఎవరు ఎవరితో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలులో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత తేల్చిచెప్పారు. జైలులో ఎక్కడా భద్రతా లోపాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. వాటిని సరిదిద్దుతున్నట్లు చెప్పారు.
విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్లో ఉద్యోగులను బదిలీ చేస్తామని, ఇప్పటి వరకు ఎవ్వరిని సస్పెండ్ చేయలేదని అన్నారు. యూనిఫాం సర్వీసులో ఉన్నవారు ధర్నాలో, బందులో పాల్గొనకూడదని, కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటామని, సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పది రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.