Uttarandhra Rains Today : భారీగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి వెళ్లే గేదె గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుమారు 80 గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంచంగిపుట్టు మండలంలో ముంతగుమ్మి వంతెన కొట్టుకుపోవడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీకే వీధి మండలం ఒడిశా వద్ద నిర్మాణంలో ఉన్న సరిహద్దు వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. నిర్మాణ సామగ్రి, రోడ్ రోలర్ కూడా నీటి పాలైంది. ఈ రహదారి చిత్రకొండ నుంచి భద్రాచలం వెళ్తుంది.
రంపచోడవరం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముసురుమిల్లి, భూపతిపాలెం జలాశయాలు నీటితో నిండాయి. దీంతో అధికారులు భూపతిపాలెం జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. పందిరి మామిడి వద్ద ఉన్న వంతెన పై నుంచి నీరు ప్రవహించడంతో మారేడుమిల్లి, వై రామవరం మండలాలకు చెందిన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జీకే వీధి మండలంలోని చట్రాపల్లి గ్రామస్తులకు పురావాస ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ స్పష్టం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులను ఆయన పరిశీలించారు. బాధితులకు సప్పర్ల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అందరికీ భోజన వసతి సదుపాయాలు కల్పించాలని చెప్పారు. మరోవైపు పాడేరు ఘాట్ మార్గం 12 మైళ్ల జంక్షన్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. అధికారులు స్థానికులు, వాహనదారుల సహకారంతో చెట్టును తొలగించారు.
ప్రమాదకర స్థాయిలో జోలాపుట్ జలాశయం నీటిమట్టం : జోలాపుట్ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పచ్చని కొండల నడుమ ఎర్రటి బురద నీరు ఉగ్రరూపం దాల్చి పరుగులు తీస్తోంది. అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో జలాశయం వైపు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు వరద ప్రభావంతో జోలాపూట్ సరిహద్దు వద్ద గల ఐరన్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.