Mumbai Actress Case Updates : ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు, అరెస్ట్ విషయంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో నాటి నిఘా విభాగాధిపతి పి. సీతారామాంజనేయులు (పీఎస్ఆర్) అరాచకాలు బయటకు వస్తున్నాయి. ముంబయిలోని కేసు ఆధారాలను చేజిక్కించుకుని, వాటిని ధ్వంసం చేసేందుకు తన అధికారహోదాను ఆయన దుర్వినియోగం చేశారు. కాదంబరీ నుంచి సీజ్ చేసిన ఐఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేముందే వాటిని నిఘా కార్యాలయానికి సీతారామాంజనేయులు తీసుకెళ్లారు. వాటిని తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఆధారాలు మాయం చేసేందుకు : సాధారణంగా ఏదైనా కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే వారినుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను పోలీసులు స్టేషన్లో తమ ఆధీనంలో ఉంచుతారు. వాటిలోని కీలక సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. కానీ కాదంబరీ జెత్వానీ కేసులో పీఎస్ఆర్ మాత్రం చట్టాన్ని తుంగలోకి తొక్కారు. దర్యాప్తు అధికారి స్వాధీనంలో ఉండాల్సిన ఫోన్లను పీఎస్ఆర్ తీసుకుని వాటిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. అక్కడ నిపుణుడితో వాటిని తెరిపించాలని ప్రయత్నించినా అది ఫలించలేదు.
దీంతో ఐఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడ కూడా వాటిని తెరిచేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా చేయలేకపోయారు. ముంబయిలో కాదంబరీ జెత్వానీపై నమోదు చేసిన కేసులో సాక్ష్యాలు సమర్పించేందుకు అక్కడి పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన సమయంలోనే విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం కుట్రలో భాగమే. ఆమె ఫోన్లో ఉన్న ఆధారాలు బయటకు వెళ్లకుండా చూసేందుకే ఇంతగా పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంబరీష్ జెత్వానీపై లుక్ఔట్ నోటీసు ఉపసంహరణ : కాదంబరీ జెత్వానీ సోదరుడు అంబరీష్ జెత్వానీ దుబాయిలో స్థిరపడ్డారు. 2013 నుంచి అక్కడే ఉంటున్నారు. భారత్కు రెండు, మూడుసార్లే వచ్చారు. కానీ వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఈ సంవత్సరం నమోదు చేసిన కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు. అంబరీష్పై అప్పట్లో లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. దీనిని ఉపసంహరించాలని ఇటీవల కాదంబరీ జెత్వానీ సీపీ రాజశేఖర్బాబును కోరడంతో ఆ నోటీసును ఉపసంహరించారు.
విద్యాసాగర్ కోసం కొనసాగుతున్న గాలింపు : పరారీలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కోసం పోలీసులు ఐదు రోజులుగా గాలిస్తున్నారు. కాదంబరీ జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయణ్ని ఏ1గా చేర్చారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో లుక్ఔట్ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే అతని పాస్పోర్ట్ గడువు 2018లోనే తీరినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే నోటీసు జారీని విరమించుకున్నారు. విద్యాసాగర్ దొరికితే కుట్రకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ముంబయి నటి కేసులో లోతైన విచారణ: డీజీపీ ద్వారకా తిరుమలరావు - DGP about Jethwani Issue