ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో కోస్తా, ఉత్తరాంధ్ర అతలాకుతలం- కట్టలు తెగిన వాగులు, నిండుకుండల్లా జలాశయాలు - Heavy Rains in AP

Heavy Rains in AP : భారీ వర్షాలకు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 7:38 AM IST

heavy_rains_ap
heavy_rains_ap (ETV Bharat)

Heavy Rains in AP :వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు ఇవాళ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎడతెరిపిలేని వార్షాలు - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు - Heavy Rains in Krishna and Guntur

కుంగిన ఏటిగట్టు :రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గినా గోదావరి, కృష్ణా పరివాహకంలోని పలు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నిలిచిన వర్షపు నీటితో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. 2,455 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం వద్ద ఏటిగట్టు కుంగిపోయింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి కిందకు జారిపోయింది. కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఏటిగట్టును పరిశీలించి మరమ్మతులు చేసి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోనసీమలోని గోదావరి నదిపాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బూరుగుంక రేవులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకుపోయి లంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమగోదవరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలది సైతం ఇదే పరిస్థితి.

లోతట్టు ప్రాంతాలు జలమయం :ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద కరాటం కృష్ణమూర్తి జలాశయానికి వరద నీరు పోటెత్తింది. అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. యనమదుర్రు కాలువ, ఎర్ర కాలువ వయ్యేరు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అత్తిలి మండలం పరిధిలో వేలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. దువ్వ వద్ద వయ్యేరు గట్టు బలహీన పడుతోంది. గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు, ఇళ్లల్లోకి నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలోని బురద కాల్వలో నీటి ప్రవాహం పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు, వరదలతో ఇబ్బందిపుడుతున్న ప్రజలు పునరావాస కేంద్రలకు తరలిరావాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు - కొట్టుకుపోతున్న రహదారులు, వంతెనలు - Rains in Alluri District

నిండుకుండలా జలాశయాలు :భారీ వర్షాలకు కొన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని కలాయణపులోవ జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని డుడుమా జలాశయంలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. ముందు జాగ్రత్త చర్య అధికారులు 7వ నంబర్‌ గేటును ఒక అడుగు మేర ఎత్తి సుమారు వెయ్యి క్యూసెక్కుల (1000 cusec) నీటిని దిగువకు వదులుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పోటెత్తి 70 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతోంది.

మంత్రుల సమీక్ష :రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలపై మంత్రులు అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది సమాయత్తం కావాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం మోపరులో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా పరిశీలించారు. కాల్వల్లో తూటుకాడ తొలగించి మురుగు సాఫీగా వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొడుతున్న వర్షాలు- అత్యధికంగా చింతూరులో 21సెం మీ - Rains in Andhra Pradesh 2024

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ(DMO-Disaster Management Organization) ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. సహాయక చర్యల కోసం సీఎం ఆదేశాలతో 21.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. ఇవాళ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ ప్రజలకు అలర్ట్ - ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు! - Rain Alert in AP 2024

ABOUT THE AUTHOR

...view details