Munneru in Spate in Khammam :చరిత్రలో ఎప్పుడూ ఎరుగని రీతిలో మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. మొదటిసారి అత్యంత గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులు దాటి ప్రవహించింది. శనివారం రాత్రి వరకు శాంతంగానే ఉన్న మున్నేరు, ఆ తర్వాత రోజు ఉదయం ఆదివారం తన ప్రతాపాన్ని చూపిస్తూ సాయంత్రానికి ఉగ్రరూపాన్నే దాల్చింది. దీంతో మున్నేరు వాగు ముంపు, పరీవాహక ప్రాంతాల ప్రజలు కకావికలం అయ్యారు. ఎటు చూసినా వరద నీటితో ఒక చెరువును తలపించింది. కాదు నదినే పొంగి వెలుతుందా అన్నట్లు ప్రవాహం సాగింది.
నీటిలో చిక్కుకున్న దానవాయిగూడెం కాలనీ, మేకల నారాయణనగర్, గణేశ్నగర్, సారథినగర్, ఎఫ్సీఐ గోదాం ప్రాంతం, పద్మావతినగర్, బొక్కలగడ్డ, పంపింగ్ వెల్ రోడ్, మోతీనగర్, మేకల వెంకటేశ్వరనగర్, ధంసలాపురం కాలనీల్లో సోమవారం ఎటుచూసినా వరదనే కనిపించింది. ఈ దృశ్యాలను చూస్తే హృదయం ద్రవించుకుపోవాల్సిందే.
ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు నష్టం : మున్నేరు ముంచడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి కట్టుబట్టలతో వెళ్లిన బాధితులు, తిరిగి ఇళ్లకు వచ్చేసరికి శాంతం తన ఒడిలోకి ఊడ్చేసుకుంది. ముంపునకు గురైన ఇళ్లల్లో నిత్యావసరాలు, బీరువాలు, ఫ్రిజ్లు, టీవీలు, కూలర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు తదితర సామగ్రి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. పదుల సంఖ్యలో వాహనాలు దెబ్బతినగా, విద్యార్థుల పుస్తకాలు, ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తడిసి ముద్దయ్యాయి. ఈ ప్రళయానికి ఒక్కో కుటుంబానికి సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.