Governor Tamilisai Republic Day Speech 2024 : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గవర్నర్ తమిళి సై అన్నారు. నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని వ్యాఖ్యానించారు. ఎన్నికల తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని వివరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Governor Tamilsai Republic Day Speech : మన దేశం భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారమని తమిళి సై(Governor Speech Today) అన్నారు. అందరినీ ఐక్యం చేసి ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగానిదేనని కొనియాడారు. రాజ్యాంగానికి అనుగుణంగా ముందుకు సాగడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ఘనత రాజ్యాంగం నిర్మాతలకు, దేశ ప్రజలకు దక్కుతుందని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. గడచిన పదేళ్లలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని పేర్కొన్నారు.
మాకు ఓటేయకుంటే చచ్చిపోతామని అభ్యర్థులు బెదిరించడం తగదు : గవర్నర్ తమిళిసై
Governor Tamilisai Comments on BRS Govt: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని గవర్నర్ అన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలిస్తేనే పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని తమిళిసై అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని వెల్లడించారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం(Mahalaxmi Scheme in Telangana) కల్పించామని గుర్తుచేశారు. మిగతా గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.