Gold Production in Andhra Pradesh: రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతంలోని 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
మన దేశంలో, ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని ఇదే కావడం ప్రత్యేకత. దీని కోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు ఈ గనిపై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ గతంలో వెల్లడించింది.
ఇతర జిల్లాల్లోనూ : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారం గనులను గుర్తించి, అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్ ఆసక్తిగా ఉంది. కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎండీసీ కోరింది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జొన్నగిరి గనులతో పాటు, ఈ గనులు కూడా అభివృద్ధి చేసిన పక్షంలో ఆంధ్రప్రదేశ్కు బంగారం గనుల రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది.