Amrapali On GHMC GIS Survey :ఆస్తి పన్ను మదింపుతోపాటు నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు భాగ్యనగరంలో చేపట్టిన జీఐఎస్ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. జీహెచ్ఎంసీలోని 5 సర్కిళ్లలో జులై 30న మొదలుపెట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్లు మాత్రమే డ్రోన్ సర్వే జరిగిందని వెల్లడించారు.
వాటిని గుర్తించేందుకే :డ్రోన్ సర్వేపై ప్రజల్లో అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్న వేళ రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ స్నేహ శబరీశ్తో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమ్రపాలి వివరాలను వెల్లడించారు. శాటిలైట్ మ్యాపింగ్కు అనుగుణంగా డ్రోన్ల ద్వారా కేవలం నగరంలోని నిర్మాణాలు, భవనాలు, రహదారులు, ఆస్తులను గుర్తించేందుకు మాత్రమే సర్వే చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం యజమానుల నుంచి బలవంతంగా ఎలాంటి ఆధారాలు సేకరించడం లేదని పేర్కొన్న ఆమ్రపాలి అనధికారిక, అధికార నిర్మాణాల ప్రస్తావన లేకుండా సర్వే చేస్తున్నట్లు వివరించారు.
ఆస్తి పన్ను పెంపు ఉండదు :డ్రోన్, ఇంటింటి సర్వే ద్వారా ఆస్తి పన్ను పెంపు ఉండదని ఆమ్రపాలి స్పష్టం చేశారు. ఆస్తి పన్ను పెంపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయమని పేర్కొన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే నిర్వహించడం వల్ల జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్ మ్యాప్ చేయడానికి ఈ సర్వే దోహదపడుతుందన్నారు.
Amrapali On Security Zones :మొత్తం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగే ఈ సర్వేలో కంటోన్మెంట్ లాంటి సెక్యురిటీ జోన్లకు సంబంధించిన సమాచారం బహిర్గతం కాదని, ప్రజల నుంచి సేకరించిన వివరాలు కూడా అత్యంత భద్రంగా ఉంచుతామని ఆమ్రపాలి తెలిపారు. నగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని, అందులో కమర్షియల్ గా 2.7 లక్షల గృహాలు ఉన్నట్లు తెలిపారు. సామాన్యుల నివాసాల నుంచి కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి వాస్తవ ఆస్తి పన్ను రాబడతామని తెలిపారు.
ఒకే సర్వే పలు రకాల సేవలు :జీఐఎస్ సర్వే ద్వారా ప్రజలకు ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేటుగానూ ఎన్నో రకాల సేవలందుతాయని ఆమ్రపాలి వివరించారు. డ్రోన్ సర్వే పూర్తయ్యాక ప్రతి అంశం మ్యాపింగ్ జరుగుతుందని, తద్వారా వీధుల్లో విద్యుత్ దీపాల దగ్గరి నుంచి చెత్త సేకరణ వరకు ప్రతి అంశం జీహెచ్ఎంసీకి సమగ్ర వివరాలు అందుతాయన్నారు. ఆస్తి పన్ను మదింపులోనూ చాలా సులభతరం అవుతుందన్నారు.