Gadwal MLA Back to BRS :బీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు తెలంగాణలోని గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్లోకి వెళ్లిన ఆయన మంగళవారం రోజున అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్లోకి వెళ్లారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గులాబీ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ను కలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరగా కేటీఆర్ ఆయణ్ను సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చేరుతూ వస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల వరకు చేరికల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా జులై 6న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.