ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసు - విజయ్‌పాల్ అరెస్టు - FORMER CID ASP VIJAY PAUL ARRESTED

మంగళవారం ఉదయం 11 నుంచి విజయ్‌పాల్‌ను విచారించిన పోలీసులు - సుదీర్ఘ విచారణ తర్వాత విజయ్‌పాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు

Former CID ASP Vijay paul arrested
Former CID ASP Vijay paul arrested (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 7:18 PM IST

Updated : Nov 26, 2024, 10:01 PM IST

Former CID ASP Vijay Paul Arrested: మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్‌. విజయ్‌పాల్​ను పోలీసులు అరెస్టు చేశారు.​ విజయ్‌పాల్​ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు, రాత్రి 9 గంటల సమయంలో విజయ్​పాల్​ని అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ విజయపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

రాత్రికి స్టేషన్​లో ఉంచేందుకు ఏర్పాట్లు:ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు సుదీర్ఘంగా విజయ్‌పాల్‌ను విచారించారు. అనంతరం విజయ్‌పాల్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్‌ ప్రకటించారు. ఈ మేరకు విజయ్‍పాల్ రిమాండ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. విజయపాల్‌ను రాత్రికి ఒంగోలు పోలీస్​ స్టేషన్​లోనే ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్​పాల్​ను బుధవారం ఉదయం గుంటూరు తరలించనున్నారు.

ఇదీ జరిగింది:2021లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీస్​కి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది జులై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అప్పటి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో పాటు నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ర్‌ ఆంజనేయులు, సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ విజయపాల్‌ చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబరు 1వ తేదీన విజయపాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు విజయ్​పాల్​కి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అయితే సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బీ వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సీఐడీ విశ్రాంత అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణకు హాజరైన విజయ్​పాల్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR

"ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కస్టడీలో రఘురామ కృష్ణరాజును కొట్టాం" - RRR Custodial Torture Case

Last Updated : Nov 26, 2024, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details