ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 4:32 PM IST

ETV Bharat / state

గొర్రెల పంపిణీ స్కామ్​పై ఈడీ ఫోకస్- వివరాలివ్వాలని అధికారులకు లేఖ - ED Inquiry On Sheep Scam

ED Inquiry On Sheep Scam in Telangana : గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో భారీగా మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ తాజాగా రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన వివరాలివ్వాలని రాష్ట్ర అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది.

ED Inquiry On Sheep Scam in Telangana
ED Inquiry On Sheep Scam in Telangana (ETV Bharat)

ED Focus on Telangana Sheep Distribution Scam :రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Sheep Distribution Scam in Telangana Updates :ఓవైపు గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తోంది. మరోవైపు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్‌ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.

గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారనే అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని తెలిపింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వండని ఆ లేఖలో పేర్కొంది.

నిందితులు మళ్లీ జైలుకు :మరోవైపు గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

అసలు కుంభకోణానికి ఆద్యులెవరు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? పదే పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు? ఆడిటింగ్‌లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు? తదితర వివరాలు రాబట్టేందుకు ఏసీబీ వీరిద్దర్నీ మూడు రోజులపాటు విచారించింది. అసలు గొర్రెలు అమ్మింది ఒకరైతే, వాటి తాలూకు డబ్బు దళారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇలా ఎలా చేశారన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు ఏసీబీ ప్రయత్నించింది. కానీ మూడు రోజులపాటు అనేక రకాలుగా ప్రశ్నించినా, నిందితుల నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. మూడు రోజుల గడువు ముగిసిపోవడంతో ఏసీబీ అధికారులు బుధవారం నాడు నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు.

నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై 275 కేసులు నమోదు - Investigating Quadge Illegal Mining

రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్‌ క్లియరెన్స్ పనులు - ముళ్లకంపలు, చెట్ల తొలగింపు - Amaravati works

ABOUT THE AUTHOR

...view details