Food Adulteration in Telangana: మనం రోడ్డు వెంట నడుచుకుంటూ అలా వెళ్తుంటే అక్కడ ఓ హోటల్లో పొంగిన పూరీలను చూసి నోట్లో నీళ్లురుతాయి. కానీ అది ఎలాంటి నూనెలో తయారు చేశారో మనం తెలుసుకోలేం. రంగులతో ఆకర్షణీయంగా చేసిన స్వీటు తినడానికి రుచిగానే ఉంటుంది. కానీ ఆ రంగులను స్వీటుతో పాటు లాగించేస్తే క్యాన్సర్కు దారీ తీస్తుందని చాలా మందికి తెలియదు. ఫైవ్ స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ మంచి వేడి వేడిగానే వడ్డిస్తారు.
ఫ్రిజ్లో దాచిన మాంసం మాత్రం తాజాదనే క్లారిటీ మాత్రం ఉండదు. బేకరీలోని కేకు, సాస్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లో మంచూరియా, నూడుల్స్, పెద్ద ఎత్తున పరిశ్రమలో భారీగా తయారు చేసే నమ్కీన్లు ఇలా తినుబండారాలు ఎక్కడపడితే అక్కడ హానికారకంగా తయారవుతున్నాయి. నిర్వాహకులు అధిక సంపాదన కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. బయటి ఫుడ్ విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ఆహారంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి.
అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి :రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించేందుకు 2024 సెప్టెంబరు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ఇన్స్పెక్టర్లతో రెండు టాస్క్ఫోర్స్ టీమ్స్ను ఏర్పాటు చేసింది. ఒకటి హైదరాబాద్ పరిధిలో కాగా మరోకటి జిల్లాల్లో. ఈ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 20 చోట్ల తనిఖీలు నిర్వహించగా కల్తీ ఘటనలు బయటపడ్డాయి. ఇటీవల మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ ప్రాంతంలో ఫుడ్ప్రోడ్యూసింగ్ తయారీ కేంద్రాన్ని అధికారులు చెక్ చేశారు.
ఉత్పత్తిదారులు వ్యాలిడిటీ పూర్తయిన మసాలాలతో చిప్స్, ఇతర నమ్కీన్లను తయారు చేస్తున్నారు. ఒక పేరుతో అనుమతి తీసుకొని మరో ప్రముఖ బ్రాండ్ పేరుతో రిటైలర్లకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నల్గొండలో ఇంటర్నేషనల్ పేరున్న ఒక ఆహారశాలలో అధిక ఉష్ణోగ్రతతో పదేపదే కాచిన నూనెలను వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. సాధారణంగా వేడి చేయని నూనెలో టీపీసీ (టోటల్ పోలార్ కాంపౌండ్స్) 15 వరకు, కాచిన నూనెలో 20 వరకు ఉండొచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏకంగా 35 టోటల్ పోలార్ కాంపౌండ్స్ దాటింది. ఇలాంటి నూనెలు ప్రమాదకరమైన క్యాన్సర్లకు దారితీస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబరు నెలలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఒక రెస్టారెంట్లో మోమోస్తో పాటు మయోనైజ్ తిని ఒక మహిళ మృతి చెందడం, 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.