ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడను ముంచెత్తిన వరద- జలదిగ్బంధంలో జనావాసాలు - Heavy Floods in Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 7:48 PM IST

Heavy Floods in Vijayawada : బుడమేరు వాగు ఉప్పొంగడం ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద ప్రవాహంతో విజయవాడ నగరం రెండు రోజులుగా జలదిగ్బంధమైంది. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణనష్టం జరగలేదు. ఎన్​డీఆర్​ఎఫ్​ (NDRF) సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు భాగమయ్యారు.

heavy_floods_in_vijayawada
heavy_floods_in_vijayawada (ETV Bharat)

Heavy Floods in Vijayawada :గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో నగరవాసులు మూడురోజులుగా నీటిలోనే నానుతున్నారు. విజయవాడలో రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. అనిత నివాసాన్నీ వరద నీరు చుట్టుముట్టింది. తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి హోంమంత్రి తరలించారు. మంత్రి ఇంటి వద్దకు చేరుకున్న రెస్క్యూ టీమ్‌ను తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అనిత ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేశారు.

కృష్ణా నది ఉద్ధృతితో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు నీటమునిగాయి. యనమల కుదురు వద్ద రక్షణ గోడ పూర్తైన చోట నుంచి దిగువ ప్రాంతమంతా నీట మునిగింది. రామలింగేశ్వర నగర్, పుట్టరోడ్డు, శివపార్వతీ నగర్, సాయినగర్ కాలనీ కాలనీల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. పెద పులిపాక, శ్రీనగర్ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర పలు కాలనీలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నిర్మించిన అపార్టుమెంట్లు, ఇళ్లలోని పెద్దఎత్తున వరదనీరు చేరింది.

Govt Distributing Food For Flood Victims Vijayawada :నిన్నటి వరకు సింగ్ నగర్ ప్రాంతానికి పరిమితమైన వరద ఉద్ధృతి క్రమంగా కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలకు విస్తరించింది. వందల ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. మంత్రి సవిత, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు, ఇళ్లన్నీ జలమయమయ్యాయి. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు కళ్యాణమండపంలో ఏర్పాట్లు చేపట్టారు .12 వేల మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది ద్వారా అందిస్తున్నారు . కొందరు స్థానికులు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, పాల ప్యాకెట్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అజిత్‌ సింగ్ నగర్ కేంద్రంగా పెద్దఎత్తున సహాయ చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.

'ఇప్పటికే వేలమందిని సింగ్ నగర్,రాజరాజేశ్వరి పేట నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. పాలు, తాగునీరు, భోజనం అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సింగ్ నగర్‌లో అమరావతికాలనీ, నందమూరి నగర్ కాలనీల్లో ఆహారం అందక పస్తులున్నాము. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదు. పిల్లలకోసం పాలు, మందులు అందజేయాలి.' - బాధితులు

హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద- 'నా కంటే ముందు సామాన్యులకు సాయం చేయండి' - Anita residence under flood

విజ‌య‌వాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లతో పాటు అత్యవసర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ M.T. కృష్ణబాబు తెలిపారు. 14 మెడిక‌ల్ రిలీఫ్ క్యాంపుల్లో అత్యవ‌స‌ర మందుల కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారన్నారు. మెడిక‌ల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంట‌లూ వైద్య సేవ‌లందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నుంచి వరద బాధితుల సహాయర్థం గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నారు. మొత్తం 6 హెలికాప్టర్ లను సహాయ చర్యలకు రంగంలోకి దించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, వైద్య సేవలకు అవసరమైన సామగ్రిని అధికారులు సిద్ధం చేశారు.

జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి- ఎక్కడిక్కడ నిలిచిపోయిన వాహనాలు - flood on national highway

ABOUT THE AUTHOR

...view details