Alai Balai Program in Hyderabad : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా సమ్మేళనం-2024 వైభవంగా జరిగింది. అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఢంకా మోగించగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు అలయ్ బలయ్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టాయి. హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన బండారు దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసిమెలసి రాష్ట్రాల అభివృద్ది కోసం పని చేయాలని అన్నారు. రాజకీయాలకతీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు వెళ్లి, దేశంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలని దత్తాత్రేయ సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించామని, ప్రేమ, ఆత్మీయత, ఐఖ్యత చాటి చెప్పాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమని వివరించారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ అలయ్ బలయ్లో ప్రదర్శించామన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, నటుడు కోట శ్రీనివాసరావు, తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బీబీపాటిల్, సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తదితరులు హాజరయ్యారు.
"తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసిమెలసి రాష్ట్రాల అభివృద్ది కోసం పని చేయాలి. రాజకీయాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలి. ఐకమత్యంతో ముందుకు వెళ్లాలి. దేశంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించాను. ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటి చెప్పాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యం." - బండారు దత్తాత్రేయ, హర్యానా గవర్నర్