APSRTC Sankranti Special Buses 2025 :సంక్రాంతి పండగ వస్తోందంటేనే ఒక సంతోషం, ఒక సరదా, ఒక ఆనందం, ఒక ఉత్సాహం. పండగ ముగిసిందంటే అయ్యో అనిపించినా అందమైన జ్ఞాపకాలెన్నో మిగులుస్తుంది. ఇది చల్లచల్లటి వాతావరణంలో నులివెచ్చటి సరదాల దొంతర. రంగురంగుల హరివిల్లులతో తీర్చిదిద్దిన లోగిళ్లు, పసుపు కుంకుమలు వేసిన గొబ్బెమ్మలు, పిండి వంటల ఘుమఘుమలు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు.
భోగిమంటలు, భోగిపళ్లు, కొత్తబట్టలు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, చెడుగుడు పోటీలు, పశువుల పందాలు ఒకటేంటి ఇల్లంతా, ఊరంతా ఒకటే హడావుడి. సంస్కృతీ సంప్రదాయాలకి మూలమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటిల్లి పాదినీ ఏకంచేసే పండగ సంక్రాంతి. సంవత్సరమంతా సుఖసంతోషాలను, శాంతిని పంచుతుంది. అందుకే ఎవరెక్కడున్నా కుటుంబసభ్యులందరినీ ఒక చోటుకు చేరుస్తుంది.
మరి అలాంటి సంక్రాంతి పండగ ప్రయాణాలు అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అలాంటి వారికి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.